అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు. జరిగాక ఎవరూ గుర్తించాల్సిన పన్లేదు. ప్రమాదాలూ అంతే. ఫలానా సమయంలో, ఫలానా విధంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేరు. ప్రమాదం జరిగిన తర్వాత లోపాన్ని గుర్తించినా, కారణాన్ని విశ్లేషించినా నయాపైసా లాభం లేదు. జరగాల్సిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిపోయే ఉంటాయి. లోపాలు ఎవరి పాలిటా శాపాలు కాకూడదనే ఉద్దేశంతో సేఫ్టీ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్గా మారారు సాత్వికా గుప్తా. ఈ రంగంలో.. ఆసియాలోనే తొలి మహిళా నిపుణురాలైన సాత్విక ‘జిందగీ’తో అనేక విషయాలు పంచుకున్నారు.
ప్రాణం ఎవరికైనా విలువైనదే. అందులోనూ కుటుంబ యజమాని మనుగడ మీద అనేక ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ఇల్లు క్షేమంగా, భార్యాపిల్లలు సంతోషంగా ఉండాలంటే.. ఇంటి యజమాని పని ప్రదేశంలో భద్రంగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యాలు ప్రాణాంతకం కాకూడదనే లక్ష్యంతో మా సంస్థ పని చేస్తున్నది. ఆ ప్రయత్నంలో ఎక్కడికి పిలిచినా వెళ్తాను. భద్రతా ప్రమాణాల గురించి అర్థమయ్యేలా అవగాహన కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
– సాత్వికా గుప్తా, మేనేజింగ్ డైరెక్టర్ సివ్వ సేఫ్టీ సొల్యూషన్స్
ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి!’ అంటాం. కానీ.. ఉత్పాదక రంగాల్లో పనిచేసే కూలీలు పనికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ‘ఎంతమంది సురక్షితంగా వస్తున్నారు? పని ప్రదేశాల్లో ఏమాత్రం భద్రత ఉంటుంది’ అని అడిగితే మాత్రం.. ‘క్షేమం కంటే ప్రమాదమే ఎక్కువ’ అంటారు సాత్వికా గుప్తా. దేశంలో నిత్యం ఏదో ఓ మూల, ఏదో ఓ ప్రమాదం జరుగుతున్నది. ఎంతోమంది కార్మికులు అగ్ని కీలల్లో, భవన శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. ‘దీనికి ప్రధాన కారణం.. యాజమాన్యాలకు భద్రతా ప్రమాణాల పట్ల అవగాహన లేకపోవడమే’ అని వివరిస్తారు సాత్విక.
దేశంలో ఇప్పటికీ ఫైర్ స్టేషన్ల కొరత ఉంది. అగ్ని ప్రమాదాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే మెలకువలు పాటించాలి అనే విషయం 90 శాతం సంస్థలకు తెలియదు. రోజూ సగటున ముగ్గురు కార్మికులు అగ్ని ప్రమాదాల వల్ల చనిపోతున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ చిన్నపాటి ఉదాహరణ చాలు.. దేశంలో భద్రతా ప్రమాణాల పట్ల సంస్థలకు, కార్మికులకు, సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించడానికి. కాబట్టే, ఆ బాధ్యత తాను తీసుకున్నారు సాత్విక.
తొలి మహిళ..
సేఫ్టీ మేనేజ్మెంట్లో ఇప్పటికీ పురుషులదే పెత్తనం. అలాంటి రంగంలో ధైర్యంగా అడుగుపెట్టి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సాత్వికా గుప్తా. ఆసియాలోనే తొలి మహిళా సేఫ్టీ ప్రొఫెషనల్ ఆమె. సాత్విక తండ్రి ఫైర్ సేఫ్టీ రంగంలో పనిచేసేవారు. ఆయన ఆలోచనలన్నీ కార్మికుల భద్రత చుట్టే తిరిగేవి. కూతురితోనూ చర్చించేవారు. ఆ వాతావరణమే సాత్వికను తండ్రి మార్గంలో నడిపించింది. ఇంటర్ అయిపోగానే.. తన మనసులోని మాట చెప్పారామె. ఆయన సంతోషంగా అంగీకరించారు. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నిర్వహించే ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ పరీక్ష రాయమని సలహా ఇచ్చారు. సాత్విక సులభంగానే ఉత్తీర్ణత సాధించారు.
ఆసియాలో ఆ పరీక్ష పాసైన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచీ ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశారు. ఫైర్ సేఫ్టీలో లెవెల్ 7 అర్హత సాధించిన తొలి మహిళ కూడా తనే. ఆ ప్రతిభకు మెచ్చి ప్రభుత్వ దవాఖానలో హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ కొలువు వరించింది. అక్కడ కొన్నిరోజులు పనిచేశాక హైదరాబాద్ వచ్చేశారు సాత్విక. ఇక్కడ ఓ ఫైర్ సేఫ్టీ కంపెనీని ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న భవనాలు, ప్రాజెక్టుల దగ్గరికి స్వయంగా వెళ్లి భద్రతా ప్రమాణాల గురించి ఇంజినీర్లకు, ప్రాజెక్ట్ మేనేజర్లకు, కార్మికులకు వివరిస్తారామె.
సెమినార్లు, అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తారు. సెంట్రో, గుబ్బా, జీవీకే వన్, ఆకాశవాణి, ఎయిరిండియా, వండర్లా, మానేపల్లి జువెలర్స్, బోస్టన్ లివింగ్, శ్రీకృష్ణ సిల్క్స్, కావేరి సీడ్స్ తదితర కంపెనీలు సాత్విక సేవలు అందుకుంటున్నాయి. సివ్వ సేఫ్టీ సొల్యూషన్స్ (Sivva Safety Solutions) ఛత్రం కింద దేశవ్యాప్తంగా విస్తరించారు సాత్విక. ‘ప్రమాదం అంటే.. అగ్ని ప్రమాదమే కాదు. రోడ్ సేఫ్టీ, కెమికల్ సేఫ్టీ, రోబోటిక్ సేఫ్టీ, న్యూక్లియర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలి. ఆ మేరకు ప్రతి సంస్థా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని వివరిస్తారు.