పదిహేనేండ్ల వయసులో ఇల్లు వదిలి ముంబై చేరిన అమ్మాయి.. ఇల్లిల్లూ తిరుగుతూ వస్తువులమ్మి పొట్టపోసుకున్న అమ్మాయి.. ఒక్కపూట భోజనంతో ఫుట్పాత్ మీద బతికిన అమ్మాయి.. పదేండ్లు తిరిగేసరికి ఏడాదికి రూ. 40 కోట్ల వ్యాపారం చేస్తున్నదంటే నమ్మగలరా? నమ్మితీరాలి. ధైర్యం, ఉత్సాహం నిండుగా ఉంటే విజయాలు వెతుక్కుంటూ వస్తాయని చీనూ ప్రయాణం నిరూపిస్తున్నది.
చీనూ కాలా పదిహేనేండ్ల వయసులో ఇల్లు విడిచింది. నేరుగా ముంబై చేరింది. ఒంటి మీద బట్టలు, చేతిలో మూడొందలు.. అంతే, తన దగ్గర ఇంతకుమించి ఏమీలేవు. మొదటి రోజు రాత్రి ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ ముందు పడుకుంది. తర్వాత రోజు.. ఒక యువతి పలకరించింది. జాలిపడి సేల్స్గాళ్ ఉద్యోగం ఇప్పించింది. కానీ, యజమాని వంకర చూపులకు తట్టుకోలేక రాజీనామా చేసింది. కొంతకాలం ఫుట్పాత్పై చిన్నచిన్న వస్తువులు అమ్ముతూ పొట్టపోసుకుంది.
ఆ సంపాదన ఒక్కపూట భోజనానికే సరిపోయేది. అంతలోనే, ఒక బట్టల దుకాణంలో సేల్స్ ఉద్యోగం సాధించింది. అదనపు రాబడి కోసం.. సాయంత్రం పూట ఒక హోటల్లో పనిచేసేది. ఇలా ఆరు నెలలపాటు రెండు ఉద్యోగాలు చేసింది. ఆ డబ్బుతో మేకప్ కోర్సు చేసింది. అలా ఫ్యాషన్ ప్రపంచం పరిచయమైంది. అనుకోకుండా టాటా కమ్యూనికేషన్స్ (ముంబై)లో టెలి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం వచ్చింది. ఆ కొలువు జీవితాన్నే మార్చేసింది. అక్కడే మేనేజర్ అమిత్ పరిచయం అయ్యాడు. ఆయన ఎంబీయే చదివాడు. ఆ స్నేహం పెండ్లికి దారితీసింది.
ఎంబీయేలో తాను నేర్చుకున్న మార్కెటింగ్ మెలకువలన్నీ అమిత్ భార్యకు బోధించాడు. ఆ ఆత్మవిశ్వాసంతో మిసెస్ ఇండియా పోటీలకు వెళ్లింది చీనూ. ఫైనల్స్లో తొలి ఐదుగురిలో ఒకరిగా నిలిచింది. ఈ గుర్తింపుతో మోడలింగ్లో అవకాశాలు వచ్చాయి. కొన్నాళ్లకు అదీ బోర్ కొట్టింది. భర్త సహకారంతో ఆభరణాల తయారీలోకి అడుగుపెట్టింది. ‘రుబాన్స్ యాక్సెసరీస్’ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమె వ్యాపారం కోట్ల టర్నో
వర్కు చేరింది. కొవిడ్ సమయంలో ఆన్లైన్ బిజినెస్ మొదలుపెట్టింది. ఫ్యాషన్ జువెలరీ మార్కెట్లో 25 శాతం వాటా సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నది చీనూ.