Ravi Varma Collections | ముంజేతి కంకణానికి అద్దం అవసరం లేదన్న మాట ఎంత నిజమో, ముంజేతిని అలంకరించే వాచీకి హంగులు అవసరమన్నది అంత నిజం! కాబట్టే, అత్యంత ఖరీదైన వాచీలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సాంకేతికతకు కళాత్మకత జోడించిన చేతి గడియారాలూ ‘టిక్ టిక్’మని పలుకరిస్తున్నాయి. తాజాగా రాజా రవివర్మ పెయింటింగ్స్ డయల్ మీద హొయలొలికిస్తున్నాయి. సమయాన్ని చూసుకున్న ప్రతిసారీ ఆ చిత్రకారుడి కళాఖండాన్ని వీక్షించడం గొప్ప అనుభవం.
స్మార్ట్ ఫోన్ల రాకతో అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు కాలం చెల్లింది. కానీ, ఫ్యాషన్లు కలిసొచ్చి వాచీలకు మాత్రం గిరాకీ పెరిగింది. స్టేటస్, విలాసం కూడా దీనికి కారణాలు. రాజా రవివర్మ 175వ జయంతి, జైపూర్ వాచ్ కంపెనీ పదో వార్షికోత్సవం.. రెండు ప్రత్యేక సందర్భాలనూ పురస్కరించుకుని జైపూర్ ప్యాలెస్ వేదికపై రవివర్మ కలెక్షన్ను ఆవిష్కరించారు. రవి వర్మ పేరు వింటేనే.. శకుంతల, మనోరమ, చిత్రలేఖ, ద్రౌపది, లక్ష్మి, సరస్వతి.. తైలవర్ణ చిత్రాలు మనోనేత్రంలో మెదులుతాయి. రవివర్మ తైలవర్ణ చిత్రాల్లోని ఆ ఇతిహాస ఘట్టాలను లగ్జరీ వాచీల్లో ఇమిడ్చేందుకు జైపూర్ వాచ్ కంపెనీ అధినేత గౌరవ్ మెహతా సుదీర్ఘ ప్రయత్నాలు చేశారు. వాటికి ఓ రూపం ఇచ్చేందుకు సుదూర ప్రాంతాలకు ప్రయాణిం చాల్సి వచ్చింది. ఇందులో ఎక్కువగా సచిన్ కలుస్కర్ అనే వ్యక్తి సేకరించినవే ఎక్కువ. కిలిమనూర్ ప్యాలెస్ ట్రస్ట్ అందించినవీ ఉన్నాయి.
రవివర్మ చిత్రాలను ఫొటోలుగా వాచీలపై ముద్రించేందుకు జపాన్ నుంచి ఓ ప్రత్యేకమైన ప్రింటర్ను దిగుమతి చేసుకున్నారు. ఆ వర్ణ విశేషాలన్నిటినీ వాచీ డయల్ సైజ్లో అచ్చు తీయడం మొదట సాధ్యపడలేదు. అనుకున్నట్లుగా చిత్రాలు రాలేదు. ముద్రణ సమస్యలతో అడుగు ముందుకు పడలేదు. ఆ సందర్భంలో ఒక ఉద్యోగి చొరవ చేసి, వైట్ డయల్ని చేర్చిన తర్వాత అద్భుతంగా ప్రింట్ అయ్యాయి. మొత్తానికి ఏడు నెలలు కృషి ఫలించి గౌరవ్ కలలు నెలవేరాయి. 40 మిల్లీ మీటర్ల డయల్లో రవివర్మ చిత్రాలను చక్కగా ముద్రించగలిగారు. ఈ సిరీస్లో వాచీల ధర 65 వేల నుంచి మొదలవుతుంది.
గౌరవ్కు చిన్నప్పటి నుంచీ వాచీలంటే ఇష్టం. ఇప్పుడు ఆ వాచీలే అతని ప్రపంచం. పదేళ్ల క్రితం ‘జైపూర్ వాచ్ కంపెనీ’ స్థాపించాడు. ఇప్పుడిది భారత దేశంలో లగ్జరీ వాచీల తయారీలో నంబర్ వన్. బ్రిటిష్కాలం నాటి నాణేలతో కస్టమైజ్డ్ వాచీలను అందించడం ద్వారా జైపూర్ వాచ్ కంపెనీ ఎంతో ఆదరణ పొందింది. తాజాగా, రాజా రవివర్మ ఆర్ట్ కలెక్షన్తో మరోసారి వార్తల్లో నిలిచింది. ‘రవివర్మ గీసిన దేవతా చిత్రాలతో వాచీలు రూపొందించాలని నా కోరిక. నేటి తరానికి రవివర్మ కృషి తెలియకపోవచ్చు. ప్రపంచ శ్రేణి వాచీల ద్వారా భారతీయ పౌరాణిక ఘట్టాలకు ప్రాచుర్యం తీసుకురాగలిగాం. ఇందుకు గర్వపడుతున్నా’ అంటారు గౌరవ్.