‘మంజునాథ నుంచి మంజమ్మ వరకు’ -ఆత్మకథలో తన కథనంతా ప్రపంచానికి చాటిచెప్పి వార్తల్లో నిలిచారు మంజమ్మ. కర్ణాటకలోని మారుమూల గ్రామంలో జన్మించారు మంజు. కనుచూపు మేరా పేదరికమే. కడుపునిండా తినాలనుకోవడమూ అత్యాశే. పురుషుడి శరీరంలోని మహిళ మనసు.. తనను పంజరం నుంచి విడిపించమని పోరుతూ ఉండేది. కానీ, ఎలా సాధ్యం? ‘అవును. నేను ట్రాన్స్జెండర్నే..’ అని ప్రకటించుకునేందుకు అనువైన వాతావరణం ఉందా ఈ దేశంలో? ఓ పురుషుడు చీరచుడితే, జాకెట్ కడితే, గాజులు తొడిగితే.. ఎగతాళి చేయకుండా ఉంటుందా సమాజం? మంజు విషయంలోనూ అదే జరిగింది.
అయినా ఎదురొడ్డి నిలిచారు. తనలోని స్త్రీత్వాన్ని ధైర్యంగా ప్రకటించారు. తమలాంటి వారికి యాచన, వ్యభిచారం తప్పించి మరో ఉపాధి మార్గం లేకపోవడం మంజమ్మకు ఇబ్బంది కలిగించింది. ఎల్లమ్మ దేవతతో ముడిపడిన కథా నృత్యాన్ని ఇంకొంత అభివృద్ధిపరిచి ఓ సంపాదన మార్గంగా తనలాంటి వాళ్లకు పరిచయం చేశారు. బెంగళూరు గల్లీలు తిరిగిన ఆ పాదాలు.. రాష్ట్రపతి భవన్నూ పావనం చేశాయి. ఢిల్లీ వెళ్లి పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకున్నారు మంజమ్మ. కర్ణాటక జానపద పరిషత్ నేతృత్వంలోని ఫోక్ మ్యూజియం చైర్మన్ బాధ్యతలూ నిర్వర్తించారు.