ఉస్మానియా క్యాంపస్ నుంచి ఆడియాలజీలో పీజీ చేసిందో అమ్మాయి.గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో రీసెర్చ్ చేసే అవకాశమూ దక్కించుకుంది. ఆ అనుభవాన్ని నిరుపేదలసేవకు ఉపయోగిస్తున్నది. అంతేకాదు, డిస్ఫేజియా అనే వ్యాధి మీద పరిశోధనచేస్తూనే.. హైదరాబాద్లోనివైద్య విద్యార్థులకు తాను తెలుసుకున్న విషయాలను బోధిస్తున్నది. ఆ సేవలకు గానుఇటీవల ఢిల్లీ ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా యంగ్ సైంటిస్ట్ పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ కర్పూరం గోవతి నిఖిల తన ప్రయాణాన్ని ‘జిందగీ’తో పంచుకున్నదిలా…
ఆడపిల్లలను గౌరవంగా చూసే వృత్తిలోనే స్థిరపడాలని చిన్నప్పటి నుంచీ ఉండేది. అంతటి గౌరవం వైద్యులకే దక్కుతుంది. డాక్టరు కనిపిస్తే జనం చేతులెత్తి మొక్కుతారు. మా తాతయ్య కూడా ‘నువ్వు డాక్టర్ కావాలి. నేను నీకు తలుపు తీయాలి…’ అని ఎప్పుడూ చెప్పేవారు. డాక్టర్ అయితే లేనివాళ్లకు సాయపడవచ్చనీ అనేవారు. అలా నా మనసులో వైద్యవృత్తి మీద గొప్ప భావన ఏర్పడింది. అయితే, ఎంబీబీఎస్ చదవడం కష్టమని నా తల్లిదండ్రుల అభిప్రాయం. నాకేమో మెడికల్ ఫీల్డ్కు రావాలని కోరిక. అందుకే, ఎలాగోలా ఇంట్లో వాళ్లను ఒప్పించి ఉస్మానియా యూనివర్సిటీలో ఆడియాలజీ కోర్సులో చేరాను.
అక్కడే పీజీ కూడా పూర్తి చేశాను. వెంటనే, మేదాంత హాస్పిటల్స్ నుంచి ఫోన్ వచ్చింది. మన దేశంలో ఎయిమ్స్ తర్వాత అంతపెద్ద దవాఖాన అదే. ఉద్యోగమే కాదు, రీసెర్చ్ చేసేందుకు కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ అది ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో ఉంది. అంత దూరమంటే ఇంట్లో ఒప్పుకోరని భయం. అందుకే, ఢిల్లీ చూద్దామన్నట్టు అమ్మమ్మను తీసుకొని వెళ్లాను. అక్కడికి వెళ్లాక ఆ వాతావరణం నాకెంతో నచ్చింది. దాంతో, అమ్మానాన్నలను ఒప్పించి చేరిపోయాను.
ఆరువేల మందికి సేవ..
మేదాంత నా కెరీర్ను మలుపు తిప్పింది. రకరకాల సమస్యలతో పేషెంట్లు వచ్చేవారు. ముక్కులో నుంచి ఆహార పైపులు వేసుకున్న వాళ్లూ కనిపించేవారు. వాళ్లలో చాలామంది డిస్ఫేజియా అనే సమస్యతో బాధపడుతున్నారని అక్కడికి వెళ్లాకే తెలిసింది. డిస్ఫేజియా అంటే మింగడంలో ఇబ్బంది. నరాల సమస్యలు ఉన్నవాళ్లు, హృద్రోగులు, క్యాన్సర్ పేషెంట్లు… ఇలా చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఇలాంటి ఇబ్బందినే తన చివరి దశలో తాతయ్య కూడా అను భవించారు. పక్షవాతం వచ్చాక ఆహారాన్ని మింగలేకపోయేవారు. ఇలాగే పైపు వేయాల్సి వచ్చింది. మేదాంతలోనూ అలాంటి వాళ్లు కనిపించేసరికి సమస్య మూలాలు తెలుసుకోవాలనే ఆత్రుత పెరిగింది. సంబంధిత కోర్సు చేశాను. తాతయ్యలాంటి చాలా మందికి సేవ చేసే అవకాశం వచ్చింది.
ఆ బాధ్యతలకు న్యాయం చేస్తూనే.. డిస్ఫేజియాకు సంబంధించి 35 దాకా పరిశోధన పత్రాలు సమర్పించాను. అవన్నీ వివిధ వైద్య పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈ రీసెర్చ్ చేసే క్రమంలో పరిచయాలూ పెరిగాయి. వాటిని సమర్థంగా ఉపయోగించుకుని నలుగురికీ సాయం చేయాలనే ఆశయంతో గోవతి హెల్త్కేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. కొవిడ్ సమయంలో ఎన్నో ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు అందించాను. నాన్న సికింద్రాబాద్ సీతాఫల్మండిలో రేషన్ డీలర్ కావడంతో, ఆ సర్కిల్ మొత్తంలోని డీలర్లకు కొవిడ్ కిట్స్ అందించాను. మిత్రుల సాయంతో వంద దాకా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించాను. గుండె, మోకాళ్ల చికిత్సలకు, ప్లాస్టిక్ సర్జరీలకు సాయం చేశాను. మా నాన్న దగ్గరికి వచ్చేవాళ్లంతా పేదలు కాబట్టి, వాళ్ల అవసరాలను బట్టి రకరకాల హెల్త్ క్యాంపులు నిర్వహిస్తాను. మొత్తంగా నా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికి ఆరువేల మందికి పైగా సేవలందించాను.
అదే నా ఆశ
సెలవులకు ఇంటికొచ్చిన ప్రతిసారీ నేను మేదాంతలో నేర్చుకున్న వివిధ అంశాలను హైదరాబాద్లోని మెడికల్ స్టూడెంట్స్కు బోధిస్తుంటాను. ఉస్మానియా కాలేజీ, హెలెన్ కెల్ల్లర్, స్వీకార్ ఉపకార్, ఏవైజేఎన్ఐహెచ్హెచ్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇందులో ఉన్నాయి. డిస్ఫేజియా చికిత్సలో ఏ వైపు నుంచి ఏ అవసరం ఉన్నా ఫోన్లో అందుబాటులో ఉంటాను. నాదైన రంగంలో ప్రతిభ కనబరిచినందుకు యంగెస్ట్ రీసెర్చర్ ఇన్ డిస్ఫేజియాగా ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నాకు చోటు దక్కింది. ఢిల్లీకి చెందిన ఎన్జీవోలు ఇచ్చే భారత గౌరవ రత్న అవార్డు, యంగ్ సైంటిస్ట్ అవార్డు సహా చాలా పురస్కారాలు అందుకున్నాను. మన రాష్ట్రంలో డిస్ఫేజియాకు సంబంధించి ఒక ప్రభుత్వ విభాగం పెడితే.. దాని ద్వారా రోగులకు సేవలందించాలని నా ఆశ. దానివల్ల మరింత మందికి నా పరిశోధన ఫలితాలు అందుతాయి. అదే కనుక సాధ్య మైతే, నాకు దక్కిన అతి పెద్ద పురస్కారంగా దాన్ని భావిస్తాను. అంతకు మించిన
ఆత్మసంతృప్తి ఉండదు.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి