International Girl child day | ఆడపిల్ల పుడితే శ్రీలక్ష్మి మన ఇంటిని ఆధార్ అడ్రస్గా మార్చుకున్నట్టే. ఆడపిల్ల నవ్వితే నట్టింట చందమామ తిష్టవేసినట్టే. ఆడపిల్ల లేని ఇల్లు బంగళా అయినా బోసిపోవాల్సిందే. ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. మనల్ని కన్నతల్లి, మనం కన్న చిట్టితల్లి. ఇద్దరు అమ్మలు ఉన్నట్టే.
అక్టోబర్ 11.. పౌర హక్కుల కార్యకర్త ఎలనార్ రూజ్వెల్ట్ పుట్టిన రోజు. ఇదే రోజును అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. బాలికల విద్య, పోషణ, హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ.. తదితర అంశాల పట్ల ఈ రూపంలో అయినా ప్రజలకు అవగాహన కల్పించాలనేది ఆ సంస్థ ఆలోచన. ‘ఇది మా సమయం.. మా హక్కులు.. మా భవిష్యత్తు’ ఈ ఏడాది బాలికా దినోత్సవ నినాదం. బాలబాలికలు.. ఇద్దరూ సమానమే. కించిత్ కూడా వివక్ష వద్దు. బాలురతో పోలిస్తే.. బాలిక ఎందులోనూ తక్కువ కాదు. అన్ని రంగాల్లోనూ అబ్బాయిలతో సమానంగా పోటీపడుతున్నది. ర్యాంకులు సాధిస్తున్నది. సీట్లు తెచ్చుకుంటున్నది. ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లోనూ సింహభాగం తనకే. అయినా, సమాజంలో ఆడపిల్లల పట్ల అనాదరణ తగ్గడం లేదు. పుట్టబోయేది ఆడ శిశువు అని తెలియగానే గర్భస్రావానికి సిద్ధ పడుతున్న కుటుంబాలూ ఉన్నాయి. ఇంతకు మించిన అమానవీయత లేదు.
భ్రూణ హత్యలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ‘గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నియంత్రణ, దురుపయోగ నివారణ చట్టం-1994’ తీసుకొచ్చింది. దానికి కొన్ని సవరణలూ చేసింది. పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అనేది నిర్ధారించడమే కాదు, అడగడమూ నేరమే. గర్భిణి వయసు ముప్పై అయిదు దాటినప్పుడు.. రెండుసార్లు లేదా అంతకు మించి కానీ గర్భస్రావం జరిగినప్పుడు.. హానికరమైన మందులు, అణు ధార్మికశక్తి, అంటు వ్యాధులు, రసాయనాల ప్రభావానికి గురైనప్పుడు.. ఆమె కుటుంబంలో మానసిక వికలాంగులు, జన్యుసంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నప్పుడు.. మాత్రమే లింగ నిర్ధారణ పరీక్షలకు అనుమతిస్తారు. నేరాన్ని ప్రోత్సహించడమూ నేరంతో సమానమే. అనాలోచిత గర్భస్రావాలు తల్లి ప్రాణానికి కూడా ముప్పే. ఇప్పటి వరకూ జరిగిన అన్యాయం చాలు. ఇక నుంచి అయినా.. ఆడపిల్లను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదువనిద్దాం, బతకనిద్దాం.
ఈ ఇద్దరు హైదరాబాదీ బాలికలు ఓ తీవ్ర సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. ‘ఇ-సైకిల్’ పేరుతో ఎన్జీవోను స్థాపించి.. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్కు పూనుకొన్నారు. ఆ సోషల్ ఆంత్రప్రెన్యూర్షిప్కు గుర్తింపుగా అమెరికాకు చెందిన ‘టీచ్ ద ఫ్యూచర్’ సంస్థ ‘నెక్ట్స్ జనరేషన్ ఫోర్సైట్ ప్రాక్టీషనర్స్, యంగ్ వాయిసెస్’ పురస్కారాన్ని అందించింది. అంతర్జాతీయంగా నాలుగు వందల యాభై బృందాలతో పోటీపడి అంతిమ విజేతలుగా నిలిచారు ఇద్దరూ. దియా లోకా చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్లో, సాహితి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో చదువు తున్నారు. ‘పుట్టిన కుటుంబంలో కానీ, చదువుతున్న విద్యాసంస్థల్లో కానీ.. బాలికలు అనే కారణంతో ఎవరూ మా పట్ల వివక్ష చూపలేదు. మా ఆలోచనల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు కూడా’ అంటారు ఇద్దరూ. ఆ బాలికల లక్ష్యం ఒకటే.. భవిష్యత్ తరాలకోసం ఈ భూగోళాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం.
అతను ముంబయికి చెందిన వ్యాపారి. భార్య గృహిణి. ఇద్దరికీ ముద్దుల కూతురంటే ప్రాణం. ఎంత ఖర్చయినా సరే, బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. ఓ పెద్ద స్కూల్లో సీటు సంపాదించారు. పాప మొదట్లో బడికెళ్లనని మారాం చేసినా.. మెల్లగా దారికొచ్చింది. స్కూల్లో స్నేహితులూ దొరికారు. రోజూ ఉత్సాహంగా సిద్ధమయ్యేది. అంతలోనే స్కూల్ నుంచి ఓ కాగితం వచ్చింది. ‘మీరు నివాసం ఉన్న ప్రాంతంలో మేం కొత్త బ్రాంచీ ప్రారంభించాం. మీ పాపను అందులోకి బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాం’.. ఇదీ ఆ నోటీసు సారాంశం. ‘నిన్నమొన్ననే సర్దుకుంది. ఇష్టంగా స్కూల్కు వెళ్తున్నది. ఇంతలో మార్పు అంటే ఎలా? చిన్నపిల్ల ఇబ్బంది పడుతుంది’ అంటూ తన మనసులోని మాట స్కూల్ మేనేజ్మెంట్కు చెప్పాడు తండ్రి. అయినా వాళ్లు పట్టించుకోలేదు. దీంతో కోర్టు మెట్లు ఎక్కాడు. ‘నా కూతురి ప్రాథమిక హక్కుకు ఇది వ్యతిరేకం’ అని న్యాయమూర్తికి మొరపెట్టుకున్నాడు. కోర్టు సానుకూలంగా స్పందించింది కూడా. కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవడం అంటే ఇదీ!