భారతదేశ వినోద రంగం విస్తరిస్తున్నది. దీంతో వినోదానికి సంబంధం లేని వివిధ రంగాల వృత్తి నిపుణులకు కూడా అక్కడ చోటు లభిస్తున్నది. ఈ క్రమంలో లీగల్ వ్యవహారాలను చక్కబెట్టడానికి న్యాయవాదుల అవసరం పెరిగింది. అలాంటివారిలో ప్రియాంక ఖిమాని ఒకరు. ఆమె తన ఇరవై నాలుగో ఏట ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్కు సంబంధించిన చట్టపరమైన అంశాలను చూసుకునే అవకాశం దక్కించుకున్నారు. లత మరణం తర్వాత కూడా ఖిమాని అండ్ అసోసియేట్స్ పేరుతో ప్రియాంక తన బాధ్యతను కొనసాగిస్తూ ఉన్నారు. ముంబై కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ వినోద రంగంలో మేధా సంపత్తి హక్కుల పరిరక్షణ వ్యవహారాల్లో ఇప్పటికే తనకంటూ ఓ గుర్తింపు పొందింది. “న్యాయవాద వృత్తికి ముందు నేను మాడలింగ్, అడ్వర్టయిజింగ్ రంగాల్లో పనిచేశాను. ఖత్రోం కే ఖిలాడీ, దస్ కా దమ్ లాంటి టీవీ షోలకు జూనియర్ రైటర్గా పనిచేశాను. కానీ,
వీటిద్వారా నాకు స్థిరమైన ఆదాయానికి భరోసా ఉండేది కాదు.
దాంతో ఆర్థిక స్థిరత్వం కోసం న్యాయ సేవల సంస్థ ప్రారంభించాను” అంటారు ప్రియాంక. ఏఆర్ రెహమాన్ లాంటి మ్యుజీషియన్లు మొదలు బాలీవుడ్ నటులు, దర్శకులు, స్క్రీన్ప్లే రచయితలకు ప్రియాంక సంస్థ న్యాయ సేవలు అందిస్తున్నది. వినోద రంగంలో చట్టపరమైన అంశాలు చాలా ఉంటాయి. ఓ కొత్త మాడల్తో కాంట్రాక్ట్, కొత్త మ్యూజిక్ ఆల్బం విడుదలలో పేటెంట్ వ్యవహారాలు, పెద్దపెద్ద సినిమాలకు పెట్టుబడులు, నిర్మాణ సంస్థల్లో భాగస్వామ్యాలు.. ఇలాంటి సందర్భాల్లో చట్టాల గురించి అవగాహన ఉండాల్సిందే. అంతేకాదు, వ్యాపార ఒప్పందాలతో ముడిపడిన పదజాలం కూడా తెలిసి ఉండాలి. ‘చేతికి మురికి అంటకుండా ఇవేవీ అనుభవంలోకి రావు. మనం ఎంత లోతుకు దిగితే అంతగా రాటుదేలతాం’ అంటారు ప్రియాంక. అయితే, ప్రతిసారీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే ఒక జీవితం సరిపోదు. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగలొచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే చట్టాల లోతు తెలిసిన న్యాయవాదుల అవసరం ఉంటుంది. ఖిమాని అండ్ అసోసియేట్స్ ఆ అవసరాన్ని తీరుస్తున్నది. అలా, ఈ ఎంటర్ టైన్మెంట్ లాయరమ్మ ఎంటరయ్యారు.