అందంగా కనిపించడం కోసం చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మెరిసే చర్మం కోసం క్రీములు, లోషన్లు రుద్దుతుంటారు. హెయిర్ కటింగ్లో, వస్త్రధారణలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పాదాల సంరక్షణను మాత్రం గాలికి వదిలేస్తుంటారు. కానీ, సుతిమెత్తగా ఉండాల్సిన పాదాలలో పగుళ్లు వస్తే తీవ్రంగా బాధిస్తాయి. అయితే, కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దామా..?
పాద సంరక్షణకు చిట్కాలు..
1. నోటి శుభ్రత కోసం ఉపయోగించే మౌత్వాష్ పౌడర్ చర్మానికి తేమను అందిస్తుంది. ఒక వెడల్పాటి బకెట్లో కొంచెం మౌత్వాష్ పౌడర్, నీళ్లు కలిపి అందులో పాదాలను 15 నిమిషాలపాటు ఉంచాలి. తర్వాత వేరే నీళ్లతో పాదాలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
2. యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న తేనె పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. పాదాలకు పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే పాదాలకు నిగారింపు వస్తుంది.
3. కొబ్బరి నూనె కూడా పొడి చర్మానికి తేమను అందించి తాజాగా మారుస్తుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే పగుళ్ల బాధ తగ్గుతుంది.
4. సాధారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా పాదాల్లో పగుళ్లు వస్తాయి. అలాంటప్పుడు వెనిగర్ కలిపిన నీటిలో పాదాలను కొద్దిసేపు ఉంచితే పగుళ్లు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
5. అదేవిధంగా పగిలిన పాదాలకు ఓట్మీల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతివారం ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.