Personal Finance | డబ్బు ఎవరైనా సంపాదిస్తారు. ఆ డబ్బును ఎంత సమర్థంగా ఉపయోగించుకోగలం అన్నదే మన సంపద వృద్ధిని నిర్ణయిస్తుంది. ఇందుకు ఆర్థిక నిపుణులు చెబుతున్న సూత్రాలు..
ఆదాయం ఏడాదికి రూ. అయిదు లక్షల కంటే తక్కువ ఉంటే.. బడ్జెటింగ్ మీద మరింత దృష్టి పెట్టండి. అందుబాటులో ఉన్న డబ్బును పొదుపుగా, ప్రణాళికాబద్ధంగా వాడుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఆదాయం తగినంతమాత్రంగానే ఉన్నప్పుడు 50-30-20 సూత్రం బాగా పనిచేస్తుంది. అంటే… రాబడిలో 50 శాతం అద్దె, గ్యాస్ లాంటి అవసరాలకు ఉపయోగించాలి; 30 శాతం షాపింగ్, ప్రయాణాలు లాంటి ఇష్టాల కోసం ఖర్చు చేయాలి; 20 శాతం కచ్చితంగా పొదుపు చేయాలి. ఆ పొదుపులో కొంత భాగాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద, మరికొంత దీర్ఘకాలిక పెట్టు బడులకు మళ్లించాలి.
ఆదాయం రూ. 5-12 లక్షల లోపు ఉంటే.. అత్య వసర నిధి ఏర్పాటుతో పాటు ఈఎమ్ఐల చెల్లింపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తూ, క్రెడిట్ రేటింగ్ పెంచుకోవాలి. రిస్క్ తక్కువగా ఉన్న మార్గాలను ఎంచుకుని వాటిలో పెట్టుబడులు పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా.. వార్షిక ఆదాయం మరింత పెంచుకుని, తర్వాత అంచెలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేయాలి. నైపుణ్యాలకు పదును పెట్టుకోవడం ద్వారా మరింత మెరుగైన ఉపాధి వెతుక్కోవచ్చు. రాబడిని పెంచుకోనూవచ్చు.
ఆదాయం రూ. 12-20 లక్షల లోపు ఉంటే, ఇంతకుముందు చెప్పుకొన్నట్టు ఎమర్జెన్సీ ఫండ్, పెట్టుబడులతో పాటుగా కొత్త రుణాల మీద దృష్టి పెట్టాలి. సమర్థంగా వినియోగించుకోగలిగితే అప్పు మనల్ని అందలాలు ఎక్కిస్తుంది. ఆ డబ్బుతో కొత్త వ్యాపారం చేయొచ్చు, ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోనూ వచ్చు. అయితే, ఈ అంచెలో ఉన్నవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆదాయం పెరిగినప్పుడు.. డబ్బు విలువ తగ్గినట్టు అనిపిస్తుంది. ఫలితంగా ఖర్చులు పెరుగుతాయి. ఖర్చుపెట్టే తీరూ మారుతుంది. వాటిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాల్సిందే!