బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్.. జీవితాన్ని అపారంగా ప్రభావితం చేసిన స్త్రీమూర్తులు.. రమాబాయి,డాక్టర్ సవిత. పరిపూర్ణ వ్యక్తిగా, న్యాయశాస్త్ర కోవిదుడిగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్న సమయంలో రమాబాయి.. తోడుగా నిలిచారు. పిడకలు అమ్మి కుటుంబాన్ని పోషించారు.మలిదశలో, ఆయన జీవితంలోకి ప్రవేశించిన డాక్టర్ సవిత.. వైద్యం చేసి, ఆయువు పోసి లక్ష్య సాధనలో నీడగా నిలిచారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ ఇద్దరినీ స్మరించుకోవాలి.
‘రమో’ నమః
రమాబాయి చిన్నప్పుడే అమ్మానాన్నల్ని పోగొట్టుకుంది. ముంబైలో మేన మామల దగ్గర పెరిగింది. తొమ్మిదేండ్ల రమాబాయితో పదిహేడేండ్ల అంబేద్కర్కు వివాహం చేశారు పెద్దలు. ఆ తర్వాతే, అంబేద్కర్ మెట్రిక్యులేషన్ పూర్తయింది. రమాబాయి చదువుకోలేదు. అంబేద్కర్ ఆమెకు చదవడం, రాయడం నేర్పించారు. అంబేద్కర్ సోదరుడి కుటుంబం కూడా ఆయనపైనే ఆధారపడి బతికేది. భర్త అధ్యయనానికి ఇంటి సమస్యలు ఆటంకం కాకుండా జాగ్రత్తపడేవారు రమాబాయి. నెలనెలా భర్త ఇచ్చే డబ్బుతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేవారు. బరోడా మహారాజు ఆర్థిక సహకారంతో.. కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివేందుకు అంబేద్కర్ అమెరికా బయల్దేరే సమయానికి రమాబాయి గర్భవతి. ఆ బిడ్డ (రమేశ్) పసి ప్రాయంలోనే చనిపోయాడు. ఆ పరిస్థితుల్లోనూ పేడ తట్టలు మోసి, పిడకలు అమ్మి కుటుంబాన్ని నడిపారు రమాబాయి. భర్త చదువుల కోసం అప్పుడప్పుడూ డబ్బు పంపేవారు.
స్వదేశానికి తిరిగొచ్చాక..
బారిస్టరుగా, అధ్యాపకుడిగా పనిచేస్తూ కొంత కాలానికి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు అంబేద్కర్. అయినా రమాబాయి తన కష్టాన్నే నమ్ముకుని బతికారు. నలుగురు కొడుకులు, ఒక కూతురు పుట్టినా.. బతికి బట్టకట్టింది మాత్రం యశ్వంత్ ఒక్కడే. తన మరణానికి ముందు రోజుల్లో అంబేద్కర్తో ఎక్కువ సమయం గడ పాలని ఆశపడేవారు రమాబాయి. గాలి మారితే మంచిదని వైద్యులు చెప్పడంతో, అప్పుడప్పుడూ భార్యను ఇతర ప్రాంతాలకు తిప్పేవారాయన. అయినా ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 27 మే 1935న.. అంబేద్కర్ ‘రమో’ అని ఆప్యాయంగా పిలిచే రమాబాయి తనను విడిచి వెళ్లిపోయారు. ఆమె మీద ప్రేమతో.. ‘థాట్స్ ఆన్ పాకిస్థాన్’ పుస్తకాన్ని అంకితమిచ్చారు బాబా సాహెబ్.
వైద్య విశారద..
అంబేద్కర్ మిత్రుడు డాక్టర్ ఎస్. రావు ముంబైలో నివసించేవారు. 1947లో ఒకసారి ఆ స్నేహితుడి ఇంటికి వెళ్లారు బాబా సాహెబ్. ఆ సమయంలోనే డాక్టర్ శారదా కబీర్ అనే యువతి పరిచయం అయ్యారు. ఆమె ఎస్.రావుగారి స్నేహితుడి కూతురు. అప్పటికి, నెహ్రూ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు అంబేద్కర్. కొంతకాలానికి ఆయన తీవ్ర అనారోగ్యంతో డాక్టర్ మాల్వాంకర్ క్లినిక్కు వెళ్లారు. అక్కడ వైద్యురాలిగా పని చేస్తున్న శారదా కబీర్ అంబేద్కర్కు పరీక్షలు జరిపారు. డయాబెటిస్, ఆర్థరైటిస్, బీపీ, నాడీ సంబంధ సమస్య, ఇతర రుగ్మతలు ఉన్నట్టు నిర్ధారించారు. కొన్నేళ్లపాటు మాల్వాంకర్ వద్దే వైద్యం చేయించుకున్నారు అంబేద్కర్. ఈ సమయంలోనే అంబేద్కర్, శారద మధ్య పరిచయం పెరిగింది. స్నేహానికి మించిన బంధంగా బలపడింది.
‘దళితుల కోసమైనా నేను ఎక్కువ కాలం బతకాలి. అందుకు నాకు ఓ తోడు అవసరం. నువ్వు సరైన జోడీ అనుకుంటున్నాను’ అని అంబేద్కర్ ఆమెకు తన మనసులోని మాట చెప్పారు. ఆ క్షణానికి శారదలో స్పందన లేదు. కొంతకాలం తర్వాత మళ్లీ అంబేద్కర్ తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ ఓ లేఖ రాశారు. శారద ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో.. అంబేద్కర్ను వివాహమాడేందుకు ఆమె సోదరుడు ప్రోత్సహించారు. దీంతో తన ఆమోదం తెలుపుతూ శారద లేఖ రాశారు. ఆ లేఖను చదవగానే, ఆనందంతో ఒక నెక్లెస్ కానుకగా పంపారు అంబేద్కర్. ఆ ఇద్దరి వివాహం 15 ఏప్రిల్ 1948న ఢిల్లీలో జరిగింది. అప్పటి నుంచీ సవితగా మారారు ఆమె. అంబేద్కర్ అభిమానులు ‘మాయీ’ అని, ‘మాయీ సాహెబ్’ అని పిలిచేవారు. ‘కొడిగట్టిన దీపంలాంటి నా జీవితాన్ని శారద సేవలు ప్రకాశవంతం చేశాయి’ అనేవారు అంబేద్కర్. పెరుగుతున్న వయసుతోపాటే అంబేద్కర్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన మరణం తర్వాత మాయీ జీవితంలో చీకట్లు అలుముకున్నాయి.
అంబేద్కర్ వ్యక్తిత్వం మహోన్నతమైనది. ఆయనను తలుచుకోగానే విస్తారమైన అధ్యయనానికి ప్రతీకగా నిలిచే విశాలమైన నుదురు, విజ్ఞానంతో మెరిసే పదునైన చూపు, మచ్చలేని దుస్తులు, తేజోవంతమైన శరీరం గుర్తుకొస్తాయి.
అంబేద్కర్తో వివాహమైన మరుక్షణం నుంచీ నేను ఆయనలో భాగమైపోయాను. ఉన్నత విద్యావంతురాలు, వైద్యురాలు, పాకశాస్త్ర నిపుణురాలు తన భార్యగా రావాలని ఆయన కోరుకునేవారట. ఆ మూడు లక్షణాలనూ మూటగట్టుకుని మెట్టినింట్లో పాదం మోపాను. నేను తనకు పదేండ్ల అదనపు ఆయువు పోశానని అనేవారు. నిజానికి, ఆయనే నాకు వందేండ్లకు సరిపడా సంతృప్తిని ప్రసాదించారు.
– సవితా అంబేద్కర్
అంబేద్కర్ వదిలిన బాణం
ఈశ్వరీబాయికి పదమూడో ఏటనే ఒక వైద్యుడితో వివాహమైంది. ఓ బిడ్డ పుట్టింది. కొంత కాలానికే భర్త చనిపోయాడు. దీంతో పుట్టింటికి వచ్చారు. సమాజంలో వివక్షను భరించారు. మహిళల స్వావలంబనకు కృషి చేశారు. నాగపూర్లో జరిగిన అఖిల భారత నిమ్న కులాల సభకు హైదరాబాద్ దక్కన్ ప్రతినిధిగా వెళ్లారు. అక్కడే తొలిసారి అంబేద్కర్ను కలిశారు. ఆయన ప్రోత్సాహంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. రాజకీయాల్లో చురుకుగా పని చేశారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షురాలిగా వ్యవహ రించారు. చిలకలగూడ కార్పొరేటర్గా ఆమె విజయ ప్రస్థానం మొదలైంది. రిపబ్లికన్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ప్రతిపక్ష నాయకురాలిగా ‘ఫైర్బ్రాండ్’ అనిపించుకున్నారు.