Kasi | అన్నపూర్ణ కొలువుదీరిన కాశీపురి (varanasi )లో అడుగడుగునా అద్భుతమైన రుచులు పలకరిస్తాయి. దూధ్ గల్లీలో శుద్ధమైన పాలకోవా.. ‘కాస్త తినిపోవా’ అంటూ ఊరిస్తుంది. ఆ పక్కనే కచోరీ వీధిలో కరకరలాడే కచోరీలు ఓ పట్టు పట్టమంటూ కచేరీ చేస్తాయి. యాత్రికులకు గంగలో మునకేస్తే గానీ కాశీయాత్ర పరిపూర్ణం కాదు! భోజన ప్రియులకు ఇక్కడి వీధుల్లోని చిరుతిళ్లు రుచి చూస్తే గానీ బనారస్ ( banaras ) పర్యటన పూర్తవదు. అనంత ఆధ్యాత్మిక రహస్యాలను తనలో ఇముడ్చుకున్న ఈ నిగూఢ నగరి ఘుమఘుమలు మీరూ ఆస్వాదించండి.
చాలామంది ముక్తి కోరుతూ కాశీకి వెళ్తారు. విశ్వనాథుడి దర్శనం కోసం కొందరు, విశాలాక్షి కటాక్షం ఆశించి మరికొందరు, భైరవుడి అభయం కోరుతూ ఇంకొందరు.. కాశీ మజిలీకి చేరుకుంటారు. ఈ నగరంలోని స్థానిక రుచులను తిని తరించాలనే లక్ష్యంతోనూ పర్యాటకులు వస్తుంటారు. పదేసి రోజులు ఉండి పుణ్యం సంపాదించడంతోపాటు.. పూటకో విందు పసందుగా ఆరగిస్తారు. శతాబ్దాల చరిత్ర ఉన్న వారణాసిలో ఆధ్యాత్మిక విశేషాలతోపాటు సంప్రదాయ రుచులు కూడా బోలెడున్నాయి. తేనీరు మొదలుకొని పన్నీరు వరకు ఇక్కడ అన్నీ ప్రత్యేకమే!
ఉష్ణోదక ప్రియులకు.. అదేనండి చాయ్ ఆరాధకులకు బనారస్ను మించిన చక్కటి చిక్కటి టీ డెస్టినేషన్ మరొకటి ఉండదేమో! వేడివేడిగా కాచిన మసాలా తేనీటి చుక్క కంఠాన్ని చేరగానే.. నీలకంఠుడిపై తేటగీతిలో ఓ శతకం ఆశువుగా చెప్పేయొచ్చు. అంత కిక్కిస్తుంది మరి! కార్పొరేట్ టీ దుకాణాలు ఊరూరా వెలిసి.. రకరకాల టీలు పెట్టిస్తున్నారనుకోండి! కానీ, తరతరాలుగా ఏకాక్షరి (టీ) సాధనలో తరించిన కాశీ వాసులు పెట్టిచ్చే తేనీరు జిహ్వకు తగలగానే ‘ఓ కైకే చాయ్ బనారస్ వాలా.. ఖుల్ జాయె బంద్ అకల్కా తాళా’ అని పాట అందుకుంటారు. టీ తాలూకు రుచి మరవకముందే దూధ్ గల్లీలోకి ప్రవేశిస్తారు పర్యాటకులు. అక్కడ మట్టికప్పుల్లో వేడివేడిగా ఉన్న బనారసీ మలాయీ ‘ఆయియే ఆయియే..’ అని ఆహ్వానిస్తుంది. ఆ రుచి చూసి పది అడుగులు వేసి వీధి మలుపు తిరుగుతుంటే మెలికలు తిరిగి, చక్కెర పాకంలో మునిగిన జిలేబీలు ఠక్కున ఆపేస్తాయి. ఆ తీపి ఒళ్లంతా చేరి మత్తులోకి జారుకునేలోపే.. కచోరీ గల్లీలోకి ప్రవేశిస్తాం! ఇంకేం ఘుమఘుమలు వెంటపడతాయి. బారులుగా తీరి ఉన్న దుకాణాల బయట కొలువుదీరిన చాట్ వెరైటీలు చటుక్కున పక్కకు లాగుతాయి. సబ్జీ కచోరీలు, చూరా మటర్, టమాటర్ చాట్, లాయియా చనా, బాటీ చోఖా.. రకరకాల చిరుతిళ్లు చూస్తూ చరచర నడిచి వెళ్లిపోగలరా! ఒక్కో వెరైటీ వివరాలు అడుగుతూ అన్నీ లాగించేస్తారు!
దేశంలోని ఏ రాష్ట్రవాసి వారణాసికి వెళ్లినా తిండికి మాడాల్సిన అవసరం రాదు! శతాబ్దాల కిందటే దేశం నలుమూలల నుంచి కాశీకేగి అక్కడ స్థిరపడిన వారు కోకొల్లలు. ఎక్కడి వారు అక్కడి రుచులతో ఇక్కడ హోటళ్లు నడుపుతున్నారు. నగరంలో నాలుగు వీధులు తిరిగితే రెండు చోట్లయినా ‘తెలుగు భోజనం తయారు’ అనే బోర్డు కనిపిస్తుంది. తమిళులకు చోళనాడు రుచులు పంచడానికి అయ్యర్ హోటళ్లు సిద్ధంగా ఉంటాయి. కన్నడిగులకు కావేరీ తీర రుచులు, కేరళీయులకు కొబ్బరినూనె పాకాలు.. ఇలా కాశీలో ఎవరికి కావలసిన రుచులు వారికి దొరుకుతాయి. వేడివేడి దోశలు, చల్లచల్లటి పెరుగు వడలు, ఊరించే పూరీలు, కాలక్షేపానికి అటుకులు.. దేశంలోని అన్ని వెరైటీలూ ఏ సమయంలో అయినా దొరికి
పోతాయి. దీనికితోడు వివిధ రాష్ర్టాలకు చెందిన సత్రాల తలుపు తడితే మృష్టాన్న భోజనం ఆ క్షణంలోనే ప్రాప్తిస్తుంది. ఇన్ని రుచులు చూసిన తర్వాత అలా నాలుగు అడుగులు వేసి బంగాలీ టోలా మీదుగా వంగవాసుల నివాసాలు చూస్తూ ఒక కలకత్తా మీఠా పాన్ దవడ కిందకు జొప్పిస్తే.. జఠరాగ్ని ఉత్తేజితం అవుతుంది. సాయంత్రానికి మళ్లీ ఆత్మారాముడు
ఆవురావురు మనడం ఖాయం. రుచులపై మరో దండయాత్రకు సిద్ధం!
“పరిగడుపున ఇవి తింటున్నారా? అయితే డేంజర్లో పడినట్టే”