మధుమేహంతో బాధపడేవాళ్లు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఏది తినొచ్చో, ఏది తినగూడదో తెలుసుకుని ఆరోగ్యానికి హాని కలుగజేయని వాటిని మాత్రమే తమ మెనూలో భాగం చేసుకుంటారు. అదేవిధంగా కోడిగుడ్డు తినే విషయంలో కూడా షుగర్ పేషెంట్లకు ఎన్నో అనుమానాలుంటాయి. కోడిగుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయని చాలామంది డయాబెటిక్ రోగులు భయపడుతుంటారు. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. మరి అధ్యయనం గురించి తెలుసుకుందామా..
పరిశోధన ఫలితాలు..
గుడ్లు తినని షుగర్ పేషెంట్లలో మాదిరిగానే గుడ్లు మితంగా తినే షుగర్ పేషెంట్లలో కూడా గుండె వ్యాధుల ముప్పు తక్కువగా ఉన్నదని తాజాగా జరిగిన అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారిలో గుడ్డువల్ల గుండె సమస్యలు తగ్గినట్లు అధ్యయనకారులు తెలిపారు. ‘సిడ్నీ యూనివర్సిటీ’ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం ప్రకారం గుడ్డు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదేనని రుజువైంది. వారానికి 12 గుడ్లకు మించకుండా తినే డయాబెటిక్, టైప్-2 డయాబెటిక్ బాధితులకు గుండె జబ్బుల ముప్పు ఉండదట.
పరిశోధన జరిగిందిలా..
పరిశోధన కోసం స్వచ్ఛందంగా వచ్చిన వారిని అధ్యయనకారులు మొత్తం మూడు గ్రూపులుగా విభజించారు. వారిలో ఒక గ్రూప్కు వారానికి 12 గుడ్ల చొప్పున, మరో గ్రూప్కు వారానికి 6 గుడ్ల చొప్పున, ఇంకో గ్రూప్కు వారానికి 1 చొప్పున కోడిగుడ్లు ఆహారంగా ఇచ్చారు. ఇలా మూడు నెలలపాటు వారికి గుడ్లు అందజేశారు. ఆ తర్వాత అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఏ ఒక్క గ్రూపు వారిలో కూడా గుండె సంబంధిత వ్యాధులకు కారణమయ్యే ప్రమాద కారకాలేవీ కనిపించలేదట. పైగా గుడ్డులోని ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు డయాబెటిక్ రోగుల ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయని తేలిందట. కానీ, మధుమేహులు వారానికి 12కు మించి గుడ్లు తింటే మాత్రం ప్రమాదం పొంచి ఉంటుందని పరిశోధకులు తేల్చారు.