డాలర్ల దేశంలో కొంతకాలం పనిచేసిన తర్వాత.. భర్తతో కలిసి ఇండియా తిరిగొచ్చారు నిమిష శ్రీనివాస్. కేరళ వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేసిన తీరును ప్రతిబింబిస్తూ ఆమె రూపొందించిన ఓ కార్పెట్ డిజైన్ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆ స్ఫూర్తితోనే ‘నేట్’ పేరుతో ఓ స్టార్టప్కు ప్రాణం పోశారు. కార్పెట్ తయారీదారులకు డిజైన్, ముడిసరుకు తానే సమకూరుస్తారు. ఇప్పటికే కేరళ, కర్ణాటకలలో షోరూమ్లు ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్ ద్వారా కూడా విక్రయాలు సాగిస్తారు. వచ్చే ఏడాది నాటికి దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించాలన్నది లక్ష్యం. నేట్ పనితీరు వైవిధ్యంగా ఉంటుంది. కస్టమర్కు ఎలాంటి రంగు, డిజైన్ కావాలి అనేది ముందే తెలుసుకుంటారు. ఆ కార్పెట్ ఎక్కడ పరుస్తారన్నదీ దృష్టిలో పెట్టుకుంటారు.
నిజానికి నిమిషకు కార్పెట్లతో దోస్తానా కొత్తేం కాదు. వందేండ్ల క్రితం ఆమె తాతయ్య ఇదే వ్యాపారం చేశారు. విదేశాలకు ఎగుమతులూ చేశారు. ‘బిజినెస్ పాతదే. కానీ నేను ఎంచుకున్న విధానమే కొత్తది. దీన్ని సామాజిక వ్యాపారంగా మలిచాను. కార్పెట్ తయారీదారులను భాగస్వాములను చేస్తున్నాను. వాళ్లకు కొత్త సాంకేతికత పరిచయం చేస్తున్నాను’ అంటారీ కేరళ యువతి. సామాజిక బాధ్యతగా మందబుద్ధి పిల్లల కోసం ఓ స్కూల్ నడుపుతున్నారు. క్యాన్సర్ చివరిదశలో ఉన్నవారి సేవలో ప్రత్యేక చికిత్సాలయం ప్రారంభించారు.