Dolma aunty | దేశ రాజధాని ఢిల్లీలో లజ్పత్నగర్ ప్రాంతంలో డోల్మా ఆంటీ మోమోలు స్థానికంగా చాలా ప్రసిద్ధి. స్థానికులతోపాటు, లజ్పత్నగర్ సందర్శకులూ డోల్మా ఆంటీ మోమోల కోసం బారులుతీరుతారు. అయితే, ఇటీవల ఈ మోమోల దుకాణం వార్తల్లో నిలిచింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన మొహమ్మద్ అక్రం ఖాన్ ‘డోల్మా ఆంటీ మోమో’ పేరుతో 2018లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తన పేరును వాడుకోవడం పట్ల ఈ విషయాన్ని డోల్మా ట్సేరింగ్ ఢిల్లీ హైకోర్టులో సవాలుచేసింది. 30 ఏండ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న డోల్మా కూడా 2023లో తన మోమోలకు ట్రేడ్మార్క్ తీసుకున్నది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ఢిల్లీ హైకోర్ట్ మొహమ్మద్ అక్రం ఖాన్ ట్రేడ్మార్క్ చెల్లదని తీర్పునిచ్చింది.
అన్నట్టు, డోల్మా ట్సేరింగ్ కుటుంబం 1950లలో బౌద్ధ గురువు దలైలామా తోపాటు టిబెట్ నుంచి భారత్ తరలివచ్చింది. కాగా, వీరి కుటుంబం కర్ణాటకలో తలదాచుకుంది. తర్వాత కాలంలో డోల్మా ఢిల్లీ చేరుకుంది. 1994లో లజ్పత్నగర్లో మోమో స్టాల్ ప్రారంభించింది. టిబెట్కు చెందిన ఈ వంటకాన్ని ఢిల్లీవాసులకు రుచి చూపించింది. అయితే, వేపుళ్లను ఇష్టపడే ఢిల్లీవాలాలకు పచ్చిగా ఉండే మోమోలంటే మొహం మొత్తేది. దీన్ని గమనించిన డోల్మా మోమోలకు మసాలా మేళవించిన చట్నీ జతచేసి వారిని ఆకట్టుకుంది. అప్పటినుంచే ఢిల్లీ వాసులు మోమోలను ఇష్టంగా తినడం మొదలుపెట్టారు.