నా వయసు 55 సంవత్సరాలు. నాకు మామిడి పండ్లంటే విపరీతమైన ఇష్టం. కానీ ఈ మధ్యే డయాబెటిస్ వచ్చింది. దీంతో తీపి పదార్థాలకు దూరంగా ఉంటున్నాను. ఏడాదికోసారే వచ్చే మామిడి పండ్లను మాత్రం దూరం పెట్టలేకపోతున్నా. వీటిని ఎలా తింటే, ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం పడకుండా ఉంటుందో చెప్పండి. ప్లీజ్!
– ఓ పాఠకురాలు
Mango | మామిడిని పండ్లలో రాజుగా పిలుస్తాం. ఇందులో సహజంగా పోషకాలు చాలా ఎక్కువ. ఇందులో ఎ, బి, సి విటమిన్లతో పాటు ప్రొటీన్లు, పీచులు, కాపర్, పొటాషియం, మెగ్నీషియంలాంటి మినరళ్లు అధిక మోతాదులో ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బొహైడ్రేట్లు కూడా ఎక్కువే. ఇందులో ఉండే సహజ చక్కెరలు షుగర్ స్థాయులను పెంచుతాయి.
అందుకే, మధురంగా ఉండే ఈ పండుకు మధుమేహులు కాస్త దూరంగా ఉండాలని చెబుతుంటారు. అయితే, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ మామిడి పండును మన ఆహారంలోని కార్బోహైడ్రేట్గా పరిగణించాలని చెబుతుంది. కాబట్టి షుగర్ ఉన్న ఒక వ్యక్తి రోజులో అరకప్పు వరకు మామిడిపండు ముక్కలు తినొచ్చు. సాధారణంగా మధుమేహులు భోజనంలో 45 నుంచి 60 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్లు తీసుకోవచ్చు.
స్నాక్స్గా 15 నుంచి 30 గ్రాముల వరకు తీసుకోవచ్చు. మోస్తరుగా పండిన వాటితో పోలిస్తే బాగా పక్వానికి వచ్చిన పండులో చక్కెర స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక మాదిరిగా పండిన వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అలాగే ఈ మామిడి పండును తినేటప్పుడు మిగతా ఆహారంతో కార్బోహైడ్రేట్లు ఎంత తీసుకుంటున్నామో లెక్కించుకోవాలి. పరిమిత మోతాదులో తినడమే కాకుండా, రోజులో ఎన్నిసార్లు తింటున్నాం, ఎంత గ్యాప్తో తింటున్నామో గమనించుకోవాలి.
మామిడిపండు ద్వారా మనం కార్బోహైడ్రేట్లు తీసుకుంటున్నప్పుడు అందుకు తగ్గమోతాదులో ప్రోటీన్ ఫైబర్ తప్పకుండా తినాలి. అందుకోసం గుడ్లు, గింజల్లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మామిడిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల అందులోని పీచులు తగ్గుతాయి. కాబట్టి పండుగా తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కివీ, బెర్రీల్లాంటి తక్కువ ైగ్లెసెమిక్ ఇండెక్స్ (జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టేవి) ఉండే పండ్లతో కలిపి వీటిని తినడం వల్ల అధిక షుగర్ స్థాయులు శరీరంలో పెరగకుండా చూసుకోవచ్చు.
అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పండును తినేప్పుడు ముందు షుగర్ ఎంత స్థాయిలో ఉందో తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఉదయం అల్పాహారంగా కానీ, అల్పాహారం ముందు కానీ మామిడి పండు తినడం మంచిది. ఆ సమయంలో మనం ఎక్కువగా శక్తిని వినియోగిస్తాం కాబట్టి, శరీరంలో షుగర్ స్థాయులు అతిగా పెరిగి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉండదు. ఇక, చక్కెర స్థాయులు అసమతుల్యంగా ఉండేవాళ్లు న్యూట్రీషనిస్టు సలహా మేరకు ఈ పండును తినొచ్చు. కాబట్టి ఇవి పాటిస్తూ మీరు కూడా ఇష్టమైన పండును ఆస్వాదించండి.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@ gmail.com