కష్టాలెప్పుడూ ఒంటరిగా రావు. మూకుమ్మడిగా దాడి చేస్తాయి. వాటిని దాటుకుని, జీవితాన్ని పునర్నిర్మించు
కోడానికి చాలా ధైర్యం కావాలి. సోనీ బిస్త్లో ఆ తెగువ పుష్కలం. ఆమె భర్త నీరజ్ సింగ్ సిపాయి. పెండ్లయిన నెల రోజులకే రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ వార్త విన్న కన్నతల్లి గుండెపోటుతో మంచం పట్టింది. ఈలోగా సోనీ తమ్ముడు పక్షవాతంతో కదల్లేని స్థితికి వచ్చాడు. విధి పగబట్టినట్టుగా సాగిన ఈ వరుస సంఘటనలతో సోనీ తల్లడిల్లిపోయింది.
కానీ కుంగిపోలేదు. ఓ సైనికుడి కూతురిగా, మరో సైనికుడి భార్యగా.. జీవితమనే యుద్ధానికి సిద్ధమైంది. ఆర్మీ వితంతువులకు పోలీసుశాఖలో కొద్దిపాటి రిజర్వేషన్ ఉంటుంది. అలా అని ఆ ఎంపిక నల్లేరు మీద బండి నడకేం కాదు. ఎన్నో కఠిన పరీక్షలు దాటాల్సిందే. ఎంతోమందితో పోటీ పడాల్సిందే. వాటన్నిటినీ ఎదుర్కొని పోలీసు కానిస్టేబుల్ కొలువు సంపాదించింది సోనీ. ఖాకీ ఉద్యోగంలోనూ సాధక బాధకాలు ఉంటాయి.
వేళాపాళా లేని సమయాలు వాటిలో ఒకటి. చిన్న పిల్లల తల్లులకు అది పెద్ద పరీక్షే! పిల్లల్ని సరిగా చూసుకోలేక పోతున్నామనే కారణంతో ఉద్యోగానికి దూరమయ్యే అమ్మలు ఎందరో. ఆ తర్జనభర్జనను అర్థం చేసుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్ స్వప్న. అందుకనే బీహార్ లోని ఔరంగాబాద్లో పిల్లల కోసం ఓ బాలమందిర్ ప్రారంభించారు.
రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేసే ఈ ‘పాలనా ఘర్’లో పదిహేను మంది మహిళా కానిస్టేబుల్స్ తమ పిల్లల్ని ఉంచుతున్నారు. ఆ తల్లులు సీసీ టీవీ ద్వారా ఎప్పటికప్పుడు పిల్లల్ని గమనించుకోవచ్చు. ఏడాది నుంచి ఐదేళ్లలోపు బాలబాలికలకు సమయానికి పౌష్టికాహారం వడ్డించడంతో పాటుగా, వయసుకు తగిన చదువులు కూడా చెబుతారు. స్వప్న మేడమ్ చొరవ కారణంగా సోనీలాంటి పోలీసమ్మల సమస్యకు పరిష్కారం దొరికింది.