రెండు మనసులూ దగ్గరైతేనే ఏ బంధమైనా చిరకాలం నిలుస్తుంది. లేకపోతే అపార్థాలు, అవమానాలతోబీటలువారిపోతుంది. అందుకే, ఆలూమగలు మానసిక సాన్నిహిత్యానికి (ఎమోషనల్ ఇంటిమసీ) ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు అనుబంధాల నిపుణులు. జీవిత భాగస్వామి మనసును గ్రహించాలి. నచ్చినా నచ్చకున్నా తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎంతసేపు కలిసున్నామన్నది కాదు, ఎంత దగ్గరగా గడిపామన్నది ముఖ్యం. గాఢత ప్రధానం. ప్రేమనైనా, ప్రశంసనైనా దాచుకోకుండా, మొహమాటపడకుండా వ్యక్తం చేయాలి. భేషజానికి పోకుండా కష్టాలను, భయాలను, బాధలను పంచుకోవాలి. నమ్మకమనే పునాదిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూనే అపోహలు, అనుమానాలు తొలగించుకోవాలి. ఏదైనా చెప్పవచ్చు, ఏదైనా చేయవచ్చు, ఏదైనా పంచుకోవచ్చు అనే సురక్షిత భావన ఇద్దరిలోనూ బలపడాలి.