ఓ భారీ నౌకను నిర్మించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో నౌకా నిర్మాణ సంస్థకు
సహకరించేవే షిప్ క్లాసిఫికేషన్ సొసైటీలు. ఆ సంస్థల ప్రమాణాల ప్రకారం నౌకను నిర్మించినట్టు ఆమోద ముద్ర పడ్డాకే.. కొత్త నౌక సముద్ర ప్రవేశానికి అధికారిక అనుమతులు లభిస్తాయి. క్లాసిఫికేషన్ రంగంలోనే అతి పురాతనమైన సంస్థలలో ఒకటి లాయిడ్స్ రిజిస్టర్. నౌకలకు ప్రత్యామ్నాయ ఇంధనంగా హైడ్రోజన్ను ఎంచుకునే విషయంలో లాయిడ్స్కు కొత్త నిబంధనల అవసరం ఏర్పడింది.
అంజనమేసి గాలించి మరీ ఆ బాధ్యతను తెలుగమ్మాయి పద్మినికి అప్పగించింది. బిట్స్ పిలానీలో చదువుకున్న పద్మిని ఇస్రోలో పనిచేస్తున్నారు. ఏడు సంవత్సరాల కెరీర్లో చంద్రయాన్-2 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లోనూ పాల్గొన్నారు. పద్మిని ఒప్పుకోగానే, ఆమె ఇంగ్లండ్ చేరుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసింది లాయిడ్స్. అంతే వేగంగా హైడ్రోజన్ నౌకల కోసం క్లాస్ రూల్స్ రూపొందించారు పద్మిని.
ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి ప్రయత్నం. పరిచయం లేని నౌకాయాన రంగం గురించి తెలుసుకోవడం, తన అనుభవానికి నిపుణుల సూచనలు జోడిస్తూ నిబంధనలు రూపొందించడం.. పద్మిని సూక్ష్మదృష్టికి నిదర్శనం. భూగోళం మీద వెలువడే కర్బన ఉద్గారాలలో మూడు శాతం నౌకల ఇంధనం నుంచే వస్తుందని తెలిసినప్పుడు.. పద్మిని మానవాళికి ఎంత మేలు చేశారో అర్థం అవుతుంది.