రీ డిజైనింగ్తో నిల్వ సామర్థ్యం పెంచినం : సీఎం కేసీఆర్
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వాల ప్రాజెక్టులు పేపర్లపై ఉంటే.. టీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ప్రజల కండ్లముందే ఉన్నాయని, కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో.. ఉన్న వనరులు కూడా పోయాయని, దానికి ఆర్డీఎస్ ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఇప్పుడు తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి దానిని మళ్లీ పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రారంభించినప్పుడే ‘ఇందులో నీళ్లురావు.. దీన్ని మునిమనవళ్లు కూడా చూడరు’ అని చెప్పానని గుర్తుచేశారు. 16 లక్షల ఎకరాలకు నీళ్లివాల్సిన ఆ ప్రాజెక్టులో రిజర్వాయర్ల సామర్థ్యం 14 టీఎంసీలేనన్నారు. అందుకే రీడిజైన్ చేసి సామర్థ్యాన్ని 227.77 టీఎంసీలకు పెంచామని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో నార్లాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు 91.52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసిన ఎల్లంపల్లిని కూడా పూర్తిచేశామన్నారు. కల్వకుర్తి పథకం 90% పనులు చేసినమని కాంగ్రెస్వారు చెప్తున్నారని, అయితే 5.60 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని.. 3.47 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లే కట్టారని విమర్శించారు.
ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చిన విధంగా లక్ష రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 25 వేల లోపు రుణాన్ని మాఫీ చేశామన్నారు. మిగిలిన వాటి గురించి ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో వివరంగా చెప్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పిందని, తాము మాత్రం లక్ష మాఫీ చేస్తామన్నామని పేర్కొన్నారు. కానీ వారి రెండు లక్షల మాఫీ హామీని ప్రజలు నమ్మలేదని చెప్పారు. ‘ప్రజలకు మాపై ఉన్న నమ్మకం, విశ్వాసం అలాంటిది’ అన్నారు. ఒక పద్ధతి ప్రకారం రుణమాఫీని చేస్తున్నామని సీఎం వివరించారు. గతేడాది 25 వేల రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేశామని, ఇందులో 4లక్షల మంది రైతులకు లబ్ధి కలిగిందని తెలిపారు. పంజాబ్లో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. ఆచరణలో చేయలేదని విమర్శించారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా చెప్పినా.. అమలు చేయలేదని గుర్తుచేశారు. వాయిదాల రూపంలో చెల్లించడంతో రైతులపై వడ్డీ భారం పడకుండా ఆ భారాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పామని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామని కేసీఆర్ తెలిపారు.
‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం కాదని, దీన్ని అధికారికంగా ఎవరూ ప్రకటించలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గీతం లేదు.. జయ జయహే తెలంగాణ రాష్ట్రీయ గీతం కానే కాదన్నారు. రాష్ట్ర గీతం రాసుకున్న తర్వాత పాడుతామని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడుతూ అన్ని రాష్ర్టాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత ఆయా రాష్ర్టాల రాష్ట్ర గీతం ఆలపిస్తారని, తెలంగాణలో మాత్రం ఆ విధంగా చేయలేదన్నారు. మన రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై సీఎం పై విధంగా స్పందించారు.