ఖమ్మం, మే 3: ఖమ్మం ఖిల్లాలో ఉన్న జాఫర్ బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా అధికారులకు ఆదేశించారు. ఇక్కడ ప్రదేశాలను సుందరీకరించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ఖమ్మంలోని ఖిల్లా ప్రాంతంలో బుధవారం పర్యటించిన కలెక్టర్.. జాఫర్ బావి పూడికతీత పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖిల్లాకు, జాఫర్ బావికి ఎంతో చరిత్ర ఉన్నందున ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. జాఫర్ బావిలోని చెత్తా చెదారాన్ని, పూడికను తొలగించాలని సూచించారు. కెమికల్ ట్రీట్మెంట్ చేపట్టాలని, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గెజిట్, రికార్డుల ప్రకారం సర్వే చేపట్టి ఖిల్లా ప్రాంత రక్షణకు చర్యలు చేయాలని ఆదేశించారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ రాధికా గుప్తా, పురావస్తు శాఖ ఏడీ నర్సింగ్నాయక్, మంగు నాయక్, జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, మున్సిపల్ ఈఈ, డీఈలు కృష్ణాలాల్, నవ్యజ్యోతి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ, రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఆర్గనైజేషన్ ఫౌండర్ కల్పన రమేశ్, బీఆర్ఎస్ నాయకులు షౌకత్ అలీ, మహిబలీ, జిలాని తదితరులు పాల్గొన్నారు.
ఆర్వోబీ మరమ్మతు పనులు పూర్తి చేయాలి
ఖమ్మం మయూరిసెంటర్ ఆర్వోబీ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మయూరిసెంటర్ ఆర్వోబీ మరమ్మతు పనుల పురోగతిని బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. చేపట్టాల్సిన, ఇప్పటికే పూర్తయిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్వోబీ మరమ్మతు పనులు ప్రగతిలో ఉన్నాయని, మెయిన్ బీమ్, క్రాస్ బీమ్ల మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. స్లాబ్ కింది భాగంలో అవసరమైన చోట పునరుద్ధరణ పనులు జరుతున్నాయన్నారు. బీమ్లకు 45 గ్రౌటింగ్ పనులకు గాను 21 పనులు పూర్తయినట్లు చెప్పారు. ఆర్డీవో రవీంద్రనాథ్, ఇంజినీరింగ్ అధికారులు శ్యామ్ప్రసాద్, కృష్ణలాల్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.