ఖమ్మం కల్చరల్, నవంబర్ 24: ‘విజేతలు మీరే.. జీవితాన్ని మా ర్చుకునే శక్తి మీలోనే ఉంది.. అన్ని శక్తులూ మీలోనే ఉన్నాయి.. చెడు వ్యసనాలను వదిలేయండి.. పట్టుదల, శ్రమ, ప్రతిభతో విజయాలను బానిస చేసుకోండి..’ అంటూ పలువురు వ్యక్తిత్వ వికాస నిపుణులు విద్యార్థులు, యువతకు పిలుపునిచ్చారు. శ్రీమిత్రా ఫౌండేషన్, విశిష్ట ఫౌండేషన్, బాలాజీ ఎస్టేట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంపా నాగేశ్వరరావు సారథ్యంలో నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన ఇంపాక్ట్-22 కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.
కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్, గంపా నాగేశ్వరరావు, శ్రీమిత్రా ఫౌండేషన్ బాధ్యులు కురువెళ్ల ప్రవీణ్కుమార్ సహా ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ చదువు, ఉద్యోగం, కెరీర్ సాధనకు వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలు చాలా అవసరమని అన్నారు. వీటికి శిక్షణ ఇస్తూ అవగాహన కల్పిస్తున్న కురువెళ్ల ప్రవీణ్కుమార్, గంపా నాగేశ్వరరావు కృషి అభినందనీయమని అన్నారు. ప్రముఖ రచయిత, వక్త యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ ఇక్కడే చదువుకోవడంతో తనకు ఖమ్మంతో ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేశారు.
విద్యార్థులు, యువతకు చదువుతోపాటు నైతిక విలువలు అనివార్యమని అన్నారు. మనసు, ప్రతిభ, సమయాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే విజయం సొంతమవుతుందని స్పష్టం చేశారు. మోటివేటర్ ఆకెళ్ల రాఘవేందర్రావు మాట్లాడుతూ జీవితాన్ని నిలబెట్టేది, కాపాడేది వారిలోని శక్తి మాత్రమేనని స్పష్టం చేశారు. జీవితంలో ఎదగడమే కాకుండా వందమందికి జీవనోపాధి కల్పించే విధంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని సూచించారు. మరో వక్త జగన్ గురూజీ ప్రసంగిస్తూ అక్షరం ఎంతో విలువైనదని, దాని ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. మరో విజేత, సాధకురాలు నైనా జైస్వాల్ మాట్లాడుతూ కుటుంబంలో తల్లి పాత్ర ఎంతో గొప్పదని, తన కెరీర్కు తల్లిదండ్రులే ప్రేరణ అని అన్నారు.
కుటుంబం నుంచే సమాజంలోని అన్ని విషయాలను అవగతం చేసుకుని ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. అగస్త్య జైస్వాల్ మాట్లాడుతూ మంచి ఆహారపు అలవాట్లు కూడా మనిషిలోని గుణగణాలను పెంచుతాయన్నారు. ఆరోగ్యంతోపాటు మంచి లక్షణాలు అలవర్చుకోవాలంటే సంప్రదాయ ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. కాగా, స్టేజీ ఫియర్ పోగొట్టుకునే విధానాన్ని గురించి కార్యక్రమ నిర్వాహకుడు గంపా నాగేశ్వరరావు ప్రయోగాత్మకంగా వివరించారు. ప్రపంచంలోని విజేతలు, నాయకులు, చివరకు దేవుళ్లు కూడా చేదు అనుభవాలను చవి చూసిన వాళ్లేనని ఉదాహరణల సహా వివరించారు.
వక్తలు సునీల్కుమార్, వరదరాజు పలు అంశాలపై చైతన్యం కల్పించారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులు, యువతీయువకులు హాజరయ్యారు. టీఎన్జీవోస్ నాయకుడు అఫ్జల్హసన్, మిత్రా ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్, విశిష్ట ఫౌండేషన్ చైర్మన్ గుర్రం శ్రీనివాస్, బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి, పాలవరపు శ్రీనివాస్, రంగా శ్రీనివాస్, చెరుకూరి యుగందర్, చారుగండ్ల రవికుమార్, మహంకాళి నగేశ్, బొమ్మిడి సునీల్, వేములపల్లి సీతారాంబాబు, పుల్లఖండం శ్రీకర్, ఉపేందర్, మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.