ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ కూసుమంచి, మార్చి 31 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్ నింపి జిల్లా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. పొట్టకొచ్చిన వరిచేలు సాగునీరు లేక ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, రైతుల పట్ల ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నదని, ఖమ్మం జిల్లా ప్రజలకు మార్చిలోనే మంచినీటి కష్టాలు తప్పడంలేదని మండిపడింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆధ్వర్యంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మదన్లాల్, చంద్రావతి, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరుల బృందం ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్, నేలకొడపల్లి మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించింది. తొలుత పాలేరు రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ, బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ గతేడాది ఇదే సమయంలో కళకళలాడుతున్న రిజర్వాయర్ ఈసారి డెడ్ స్టోరేజీ లెవల్కు పడిపోవడానికి ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే కారణమన్నారు.
రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని, సాగునీరు అందిస్తామంటేనే యాసంగి పంటలు రైతులు వేసుకున్నారని, ఒకటి, రెండు తడులు ఇచ్చినా జిల్లాలో వేలాది ఎకరాల పంట చేతికి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఎకరానికి రూ.30 వేలు చొప్పున పంట నష్టపోయిన రైతులకు చెల్లించాలని ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. అనంతరం నేలకొండపల్లి మండలంలోని సింగిరెడ్డిపాలెంలో ఎండిపోయిన రైతుల పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను, ఆందోళనను పార్టీ నేతలముందు వెలిబుచ్చారు. బోదులబండకు చెందిన ధనమూర్తి అనే రైతు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి తప్పుచేశామని, మూడునెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు రంగు బయటపడిందని, రైతులను కనీసం ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయడంలేదని తాము ఐదెకరాల్లో వేసిన వరి పూర్తిగా ఎండిపోయిందన్నారు. గతంలో ఈ తరహా దుర్భర పరిస్థితులు ఈ ప్రాంత రైతులు ఎప్పుడూ ఎదుర్కొనలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగిపోయాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం రైతును ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా ఉంటారని వారి సమస్యలను పరిష్కరించేందుకు పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ వారికి ధైర్యం చెప్పి బీఆర్ఎస్ రైతుల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉందని, సాగర్ నీటితో పాలేరు జలాశయాన్ని నింపే వరకూ ఊరుకునేదిలేదని, అలాగే రైతుబంధు వేస్తామని రైతులను మభ్యపెట్టడం తప్ప ఇప్పటివరకు అనేకమంది రైతులకు వేయలేదని పలువురు రైతులు మధుకు వివరించారు. రైతు సమస్యలపై తాము పోరాడుతామని, రైతుబంధు పడేంతవరకూ ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, డాక్టర్ బానోత్ చంద్రావతి, మదన్లాల్, మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, వెంకటరమణ, మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, వేముల వీరయ్య, ఉన్నం బ్రహ్మయ్య, పాషబోయిన వీరన్న, కార్యదర్శి ఆసీఫ్ పాషా, నాయకులు మల్లీడి వెంకన్న, చాట్ల పరశురాం, జర్పులా బాలాజీ, ఆర్మీ రవి, మట్టా వెంకటేశ్వర్లు, కిషన్, రాయభారపు రమేశ్, కాసాని సైదులు, ఉపేంద్రాచారి, బాలకృష్ణ, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.