భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అయితే ఇంకా అర్హులెవరికైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్తగూడేనికి గురువారం వచ్చిన ఆయన.. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలనూ అమలు చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, మరో రెండు గ్యారెంటీలు ఈ మధ్యే ప్రారంభించామని గుర్తు చేశారు. అయితే మార్చి నెల నుంచి పేదలెవరూ కరెంటు బిల్లులు కట్టేపని ఉందడని అన్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించినట్లు చెప్పారు. అలాగే అర్హులందరికీ రూ.500కే గ్యాస్ కూడా వస్తుందని అన్నారు. ఈ పథకాలు అందని వారు, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఉంటే వెంటనే సమీప తహసీల్దార్ల కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశామని, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని అన్నారు. అనంతరం కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్లో చేరారు.
కొత్తగూడెం టౌన్/కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 29 : జిల్లాకు వచ్చిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, ఎస్పీ రోహిత్ రాజు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్తగూడెంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మంత్రిని వారు వేర్వేరుగా కలిసి పూల మొక్కలు అందజేశారు.