వేంసూరు, డిసెంబర్ 17: ప్రతి పల్లె పచ్చని చెట్లతో కళకళలాడాలనే ఉద్దేశంతో నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని లింగపాలెం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేస్తున్న నర్సరీని, కాల్వపై కల్వర్టు నిర్మాణ ప్రదేశాన్ని ఎంపీఓ రంజిత్కుమార్తో కలిసి పరిశీలించి మాట్లాడారు.
గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఆలయాలు, వీధులకు ఇరువైపులా మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. లింగపాలెం వైకుంఠధామానికి రహదారి సరిగా లేకపోవడంతో కాల్వ వద్ద కల్వర్టు నిర్మించాలని ఎమ్మెల్యే సండ్రకు సమస్యను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే సింగరేణి యజమాన్యంతో మాట్లాడి సింగరేణి నిధులు నుంచి రూ.5లక్షలు మంజూరు చేయించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ యర్రా రమేశ్, ఎంపీటీసీ నున్నా రాంబాబు, కార్యదర్శి పద్మ, నాయకులు సింగపోగు ప్రసాద్ పాల్గొన్నారు.