HomeKhammamVigilance Is Required In The Registration Of Ssc Nominal Rolls
తప్పు దొర్లితే తిప్పలే..
పదో తరగతి మార్కుల మెమోలో విద్యార్థుల వ్యక్తిగత వివరాల్లో తప్పులు దొర్లితే వాటిని మళ్లీ సవరించుకోవడం సాధారణ విషయం కాదు.
ఎస్ఎస్సీ నామినల్ రోల్స్ నమోదులో అప్రమత్తత అవసరం
జిల్లాలో 20 వేల మంది విద్యార్థుల సన్నద్ధత
నేటి నుంచి డీఈవో కార్యాలయంలో నామినల్ రోల్స్ స్వీకరణ
అన్నింటికీ టెన్త్ మెమోనే..
పదో తరగతి మార్కుల మెమోలో విద్యార్థుల వ్యక్తిగత వివరాల్లో తప్పులు దొర్లితే వాటిని మళ్లీ సవరించుకోవడం సాధారణ విషయం కాదు. ఇందుకు సుదీర్ఘ ప్రాసెస్ ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన జనన ధ్రువపత్రం, ఆధార్ వంటి వాటిల్లో ఏ విధంగా పేరు ఉంటుందో అదే విధంగా ఇంగ్లిష్ అక్షరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక్క అక్షరం తప్పు వచ్చినా భవిష్యత్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు, పాస్పోర్ట్, వీసా పొందేందుకు ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లో తప్పులు దొర్లితే సవరించుకునేందుకు విద్యార్థి చదివిన పాఠశాల నుంచి ప్రారంభించి ఎన్నో ధ్రువపత్రాలు, అపిడవిట్లు సిద్ధం చేసుకుని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో సమర్పించి అక్కడ నుంచి పొందాల్సి ఉంటుంది.
ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 27: పాఠశాల విద్యలో పదో తరగతి చివరి దశ. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు సమగ్ర వివరాలతో కూడిన సర్టిఫికెట్ అందుకోవడం కీలకమైన అంశం. తదుపరి ఉన్నత విద్యాభ్యాసం కోసం పదో తరగతి మార్కుల జాబితానే ప్రామాణికం. ఇటువంటి నేపథ్యంలో పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల వివరాలను సక్రమంగా ప్రభుత్వానికి పంపించే బాధ్యత ఆయా పాఠశాలల యాజమాన్యాలపై ఉంటుంది. తమ పిల్లల వ్యక్తిగత వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో తప్పులు లేకుండా అప్లోడ్ చేశారో లేదో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో జరుగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 419 స్కూళ్ల నుంచి 20 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థుల వ్యక్తిగత వివరాలు (పేరు, ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ) వంటివి చైల్డ్ఇన్ఫోతో సరిచూసుకొని నామినల్ రోల్స్లో తప్పులు లేకుండా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా పంపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ఆదేశించింది.
ఫీజుల షెడ్యూల్ ఇలా..
టెన్త్ పరీక్షల ఫీజును అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు ఈనెల 26 వరకు అవకాశం ఉండగా అది ముగిసింది. రూ.50 అపరాధ రసుంతో ఈ నెల 30 వరకు, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 15వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 29 వరకు చెల్లించొచ్చు. అదనపు రుసుంతో ఫీజు చెల్లించే విద్యార్థుల నామినల్ రోల్స్.. ఫీజు గడువు ముగిసిన రెండు రోజుల్లో డీఈవో కార్యాలయంలో అందజేయాలి.
ఆన్లైన్ ఇలా..
ముందుగా పాఠశాలకు సంబంధించిన టెన్త్ విద్యార్థుల ఫీజు మొత్తం ఒకే చలాన్లో చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. ఏజ్ కండిషన్కు మాత్రం విడిగా చలాన్ పేమెంట్ చేయాలి. స్టూడెంట్ ఇన్ఫో నుంచి చైల్డ్ ఐడీ పొందుపర్చాలి. మిగిలిన డేటా అంతా ఇందులోనే నమోదు చేయాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు వంటివి కూడా ఇంటిపేరుతో ప్రారంభించి మొత్తం రాయాలి. ష్టార్ట్కట్గా నమోదు చేయవద్దు. ఫొటో సైజ్ కూడా 30 కేబీ నుంచి 40 కేబీ మధ్య ఉండాలి. సంతకం సైజ్ 10 కేబీ నుంచి 20 కేబీ మధ్య ఉండాలి.
నమోదు చేస్తున్న యాజమాన్యాలు..
పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ప్రస్తుతం ఫీజుల చెల్లింపు హడావిడి నెలకొంది. ప్రభుత్వం సూచించిన వెబ్సైట్లో యాజమాన్యాలు విద్యార్థుల సమగ్ర వివరాలను నమోదు చేస్తున్నాయి. నామినల్ రోల్స్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాల హార్డ్కాపీలను ఎంఈవోలతో వెరిఫై చేయించి డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థుల వివరాలను అప్లోడ్ చేసే క్రమంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంది.
నేటి నుంచి నామినల్ రోల్స్ స్వీకరణ..
పదో తరగతి నామినల్ రోల్స్ను ఈ నెల 28 నుంచి ఈ నెల 30 వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎంఈవోలకు, పాఠశాలలకు సమాచారం ఇచ్చారు. ఎస్ఎస్సీ-2023 తాలూకు ఎన్ఆర్ పరిశీలన పూర్తయి ఎంఈవో ధ్రువీకరణ తర్వాత స్టూడెంట్ ఆన్లైన్ దరఖాస్తుల వివరాలను కన్పర్మ్ చేయాలి. ధ్రువీకరణ చేసిన వివరాలను డీఈవో కార్యాలయంలో పరీక్షల విభాగం అధికారులకు అందజేయాలి. సప్లిమెంటరీకి సంబంధించి నామినల్ రోల్స్లో ఆప్షన్ ఇవ్వలేదు. పరీక్షలకు ప్రభుత్వం నిర్దేశించిన వయస్సు లేని వివిధ పాఠశాలల్లో చదువుతున్న 150 మంది విద్యార్థులు డీఈవో నుంచి అనుమతి పొందారు.