కొత్తగూడెం గణేశ్టెంపుల్, జూలై 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. కొత్తగూడెంలో విమానాశ్రయం అవసరాన్ని పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించేందుకు కేంద్రం ‘రాజ్ టెక్నాలజీస్’ సంస్థకు బాధ్యతలు అప్పగించగా, సుజాతనగర్ – సీతంపేట పరిసరాలు అనుకూలంగా గుర్తించినట్లు పేరొన్నారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసి అవసరమైన అనుమతులను త్వరగా మంజూరు చేయాలని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ఎంపీ కోరారు. భద్రాచలం ఆధ్యాత్మిక క్షేత్రం, సింగరేణి ప్రధాన కార్యాలయం, కేటీపీఎస్, హెవీ వాటర్ప్లాంట్, కిన్నెరసాని ప్రాజెక్టు వంటి కీలక సంస్థలు జిల్లాలో ఉండడంతో విమానాశ్రయం ఏర్పాటుతో పర్యాటకం, పారిశ్రామిక, వాణిజ్యరంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని రవిచంద్ర ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులను కూడా వేగవంతం చేయాలని, ఖమ్మం – కొత్తగూడెం – భద్రాచలం రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించాలని, కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటు, రైల్వేమార్గ విస్తరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.