భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 30 (నమస్తే తెలంగాణ): వ్యాపారులు తమ వద్ద నిత్యావసర వస్తువుల స్టాక్ వివరాలను ప్రతీ శుక్రవారం ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని అన్నారు. జిల్లా అధికారులు, చాంబర్ ఆఫ్ కామర్స్, వర్తక, వాణిజ్య వ్యాపారులతో కలిసి ఐడీవోసీలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 1,59,432 ఎకరాల్లో వరి సాగవుతోందని, 90 శాతం రైతులు సన్నబియ్యపు ధాన్యాన్ని, మిగిలిన 10 శాతం దొడ్డు రకం ధాన్యా న్ని పండిస్తున్నారని అన్నారు. అలాగే జిల్లాలో 6 వేల ఎకరాల్లో పప్పు దినుసుల పంటలు పండిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో వరి సాగు ఎక్కువ జరుగుతోందని అన్నారు. ధాన్యం, పప్పులు, వంట నూనెల స్టాక్ వివరాలను తప్పకుండా ఆన్లైన్ చేయాలని సూచించారు.
దాంతోపాటు ఆ వివరాల నివేదికను జిల్లా పౌర సరఫరాల అధికారికి అందజేయాలని సూచించారు. నిత్యావసర వస్తువులు అక్రమంగా దాచిపెట్టి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పౌరసరఫరాల అధికారులు కూడా నిత్యం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యాన సాగులో కూరగాయల సాగుకు రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బియ్యం, పప్పు దినుసులు, నూనె ధరల్లో నిరుటికి, ఈ ఏడాదికి ఉన్న వ్యత్యాసాలను వివరించారు. అందుకుగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర వస్తువులను కొరత రావొద్దని, ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచడం వ్యాపారుల బాధ్యతని అన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు రుక్మిణిదేవి, త్రినాథ్బాబు, అభిమన్యుడు, జినుగు మరియన్న, ఆలీం, సునీత పాల్గొన్నారు.