వరసిద్ధి వినాయకుడు తొమ్మిది రోజులపాటు పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు.. బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్లతో మండపాలను ముస్తాబు చేశారు. నిర్వాహకులు గణనాథుల ప్రతిమలను కొనుగోలు చేసి మండపాలకు తరలించారు. గణనాథులు, పూజ సామగ్రి కొనుగోళ్లతో మంగళవారం మార్కెట్లో సందడి నెలకొంది. బుధవారం ఉత్సవ కమిటీలు, భక్తుల కోలాహలం మధ్య వినాయకులు కొలువు దీరనున్నారు. ఖమ్మం బ్రాహ్మణబజారు శివాలయం సెంటర్లో 27 అడుగుల విత్తన మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మట్టి విగ్రహం కావడం విశేషం. నగరంలోని మండపాలకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి అజయ్కుమార్ విద్యుత్ సరఫరా, మైక్ అనుమతులకు సంబంధించిన ఖర్చును అందజేశారు.
– ఖమ్మం కల్చరల్, ఆగస్టు 30
‘ఓం గణాధిపతయే నమః’.. సర్వ శుభాల్ని కలిగించేవాడు.. సకల విఘ్నాలను తొలగించేవాడు.. దేవగణాలకు గురువు.. విఘ్నాధిపతి.. భక్తుల కొంగుబంగారం.. వరసిద్ధి వినాయకుడు తొమ్మిది రోజులపాటు భక్తులచే పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు.. భాద్రపద శుద్ధ చవితి బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు భక్తులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాడవాడలా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్లు, మండపాల్లో గణనాథులు కొలువు దీరనున్నారు. భక్తులు వినాయక చవితి పూజ, వ్రతాలను తమ ఇండ్ల వద్ద భక్తిప్రపత్తులతో ఆచరించనున్నారు. తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేందుకు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. – ఖమ్మం కల్చరల్, ఆగస్టు 30
పత్రి, ఫలపుష్పాల క్రయవిక్రయాల సందడి
భక్తులు 21 పత్రులతో గణపతిని పూజించి ప్రసన్నం చేసుకుంటారు. మారేడు, వాకుడు , గరికె, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, మర్రి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మధుపం, సింధువారం, జాజీపత్రం, గండకి, శమీ, రావి, మద్ది, తెల్లజిల్లేడు పత్రాలతో పూజిస్తారు. పత్రాలే కాకుండా పలు రకాల పూలు, పండ్లతో సేవిస్తారు. దీంతో వందలాది మంది భక్తులు పత్రులు, పాలవెల్లి, పూలు, పండ్లు కొనుగోలు చేశారు. నగరంలో పలుచోట్ల పత్రి, ఫలపుష్పాలు, పాలవెల్లి క్రయవిక్రయాల జోరుగా సాగాయి.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మండపాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. వివిధ రకాల నమూనాల్లో సెట్టింగ్లు చేశారు. పలు రకాల ఆకృతుల్లో గణనాథులు కొలువుదీరనున్నారు. మండపాల్లో ఐదు నుంచి 27 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ సారి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు మట్టి గణనాథులనే ఏర్పాటు చేస్తున్నారు. భక్తబృందాలు వినాయక విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించి మండపాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఉత్సవ కమిటీలు, భక్తబృందాల కోలాహాలం మధ్య గణనాథులు మండపాల్లో కొలువు దీరనున్నారు. ఖమ్మం బ్రాహ్మణబజార్ శివాలయం సెంటర్లో 27 అడుగుల విత్తన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద విగ్రహం కావడం విశేషం.
పత్రి, ఫల పుష్పాలే పూజాద్రవ్యాలు
వినాయక చవితి రోజు భక్తులు వేకువజామునే లేచి, పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇండ్లను శుభ్రం చేసుకుని, మామిడి తోరణాలతో అలంకరిస్తారు. గదిలో ఈశాన్యమూల స్థలాన్ని శుద్ధిచేసి అలికి, బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు వేస్తారు. పాలవెల్లి కట్టి, దేవుడికి పీటవేసి, ఆ పీటకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేస్తారు. దానిపై యథాశక్తి గణపతి విగ్రహాన్ని పెడతారు. తొలుత గణపతికి ప్రార్థన చేస్తారు. కలశాన్ని నూతన వస్త్రంతో అలంకరించి, గణపతిని ఆవాహన చేస్తారు. అనంతరం ఆచమనం, దీపారాధన, సంకల్పం, షోడశోపచార పూజ, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యపాద్యాలు, అథ అంగపూజ, శ్వేతగంధాక్షతలు, నానావిధ ఫల, పుష్పాలు, 21 పత్రాలతో పూజ చేస్తారు. అనంతరం ధూపదీప నైవేద్యాలతో గణపయ్యను ప్రసన్నం చేసుకుంటారు. గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్లు, తెల్లనువ్వులు కలిపిన మోదుగాకులు, అప్పాలు, లడ్డూలు, పరమాన్నం, కుడుములు తదితర 21 ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
వినాయకోత్పత్తి..
పార్వతిదేవి తను స్నానమాచరించడానికి వెళ్తూ నలుగుపిండితో ఒక ప్రతిమను చేసి, దానికి ప్రాణప్రతిష్ట చేసి కాపలా ఉంచుతుంది. ఆ బాలుడు శివుడ్ని వాకిట్ల్లోనే నిలిపేస్తాడు. దీంతో ఆగ్రహించిన శివుడు బాలుడి శిరచ్ఛేదనం చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతి విలవిలలాడుతుంది. శివుడు కూడా చింతిస్తాడు. వెంటనే గజాసురుడి శిరస్సును ఆ బాలుడి మొండేనికి అతికించి, ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని కలిగిస్తాడు. గణేశుడు గజాననుడై, శివపార్వతుల ముద్దుల పట్టీ అవుతాడు. సర్వవిఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడిని కోరతారు. ఈ విషయంలో గజానుడు, కుమారస్వామికి పోటీ పడుతుంది. ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని శివుడు చెబుతాడు. వినాయకుడు నారాయణ మంత్రంతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆవిధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి, మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు.
మండపాలకు పువ్వాడ ఫౌండేషన్ వితరణతో విద్యుత్ సరఫరా
పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత ఉత్సవానికి పలు సంస్థలు ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశాయి. ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 6 వేలు, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 8,500, కాలుష్య నియంత్రణ బోర్డు 1,000, సీఎమ్మాఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో 5,000, స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 5 వేలు, వికాస తరంగిణి ఆధ్వర్యంలో సుమారు 2 వేల మట్టి విగ్రహాలను ఉచితంగా అందజేశారు. నగరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ మండపాలకు పువ్వాడ ఫౌండేషన్ వితరణతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విద్యుత్ సరఫరా, మైక్ అనుమతుల ఖర్చులను అందజేశారు.
వినాయక వ్రత కథ..
చంద్ర వంశానికి చెందిన ధర్మరాజు సిరి సంపదలను పోగొట్టుకుంటాడు. కుటుంబంతో వనవాసం చేస్తూ నైమిశారణ్యానికి చేరుకుంటాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి, తన పూర్వవైభవం కోసం చేయాల్సిన వ్రతాన్ని చెప్పమంటాడు. దానికి సూత మహర్షి వినాయక వ్రతం చేస్తే సకల కష్టాలు తొలగిపోయి, సకల సౌఖ్యాలు కలుగుతాయని చెబుతాడు. కుమారస్వామికి పరమశివుడు ఈ వ్రత మహాత్యాన్ని గురించి చెబుతాడు. విదర్భ యువరాణి దమయంతి ఈవ్రతం చేయడంతో తాను ఇష్టపడిన నలమహారాజును పెళ్లి చేసుకుందని, శ్రీకృష్ణుడు ఈ వ్రతం చేయడంతో శమంతకమణితోపాటు జాంబవతి, సత్యభామలను పొందగలిగాడని వ్రత మహాత్యాన్ని వివరిస్తాడు.