భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ కొత్తగూడెం టౌన్, జనవరి 14: కల్లాల్లో ధాన్యపు రాశులు.. వీధుల్లో హరిదాసుల కీర్తనలు.. డూ డూ బసవన్నల విన్యాసాలు.. ఇళ్ల ముంగిళ్లలో రంగవల్లులు.. పిండివంటల ఘుమఘుమలు.. పిల్లలు, యువతుల కేరింతలు.. నింగికెగిరే పతంగులు.. చిన్నారుల కేరింతలు.. ఇలా పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి పిల్లాపాపలతో స్వగ్రామాలకు చేరుకోవడంతో గ్రామాల్లో సందడి నెలకొన్నది.
పాడిపంటలు రైతుల ఇంట సిరులు కురిపించే వేళ.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వేళ.. ప్రతి ఇంటా సం‘క్రాంతి’ తెచ్చింది. ఆదివారం పండుగను ఘనంగా జరుపుకొనేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకొనే ఈ పండుగ పల్లెలు, పట్టణాలకు కొత్త కళను తీసుకొచ్చింది. కొత్త కోడళ్లు, కొత్త అల్లుళ్లు, బంధువులతో ప్రతి ఇంట్లో సందడి నెలకొన్నది. పండుగ సందర్భంగా శనివారం వస్త్ర దుకాణాలు, షాపింగ్ మాల్స్, పతంగుల దుకాణాల్లో సందడి కనిపించింది. పట్టణాలు, మండల కేంద్రాల్లో కొనుగోలుదారుల రద్దీ కనిపించింది. పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో పిండి వంటల ఘుమఘుమలు పలకరిస్తున్నాయి. మహిళలు చిన్నారులకు ఇష్టమైన గారెలు, బూరెలు, అరిసెలు,పాకుండలు, చకినాలు, మిఠాయిలు, కారపూస వంటి వంటకాలు చేస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ పార్టీల నాయకులు, ప్రైవేటు సంస్థలు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాయి. ఔత్సాహికులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారు. పోటీలు పూర్తయిన వెంటనే విజేతలకు బహుమతులు అందజేస్తున్నారు.
కనుమ పండుగ సంక్రాంతి తర్వాత వస్తుంది. ఈరోజు మహిళలు పశువులనే దేవతలు భావించి పూజ చేస్తారు. వ్యవసాయానికి మరింత సాయపడాలని వేడుకుంటారు. కనుమ రోజు మాంసాహారం వండి కుటుంబ సమేతంగా ఆరగిస్తారు. బోగి, సంక్రాంతి రోజుల్లో శాకాహారం తిన్నవారు మూడో రోజు కనుమన ఆ ముచ్చట తీర్చుకుంటారు.
సంక్రాతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నది. అయినా రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.. నెలరోజుల ముందు నుంచే రిజర్వేషన్లు చేయించుకుని పట్నం నుంచి ప్రయాణికులు పయాణమయ్యారు, దీంతో ఖమ్మం వరకు నడుస్తున్న రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి, ప్రైవేటు బస్సులు కూడా రద్దీగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కార్లతో ఊర్లన్నీ నిండిపోతున్నాయి.
ప్రతి ఏడాది సంక్రాంతి లాగానే ఈ ఏడాది పండుగకూ పతంగుల ఎగురవేసేవారు కనిపిస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలకు చెందిన చిన్నారులు పతంగులు ఎగురవేసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. మార్కెట్లో ఇప్పుడు రకరకాల పతంగులు అందుబాటులోకి వచ్చాయి. దుకాణాల్లో కాగితపు పతంగులే కాక సినీ తారలు, పక్షులు, రాజకీయ నేతల చిత్రాలతో ప్లాస్టిక్ కవర్ పతంగులు కనిపిస్తున్నాయి. ఒక్కో పతంగు ధర కొత్తగూడెంలో రూ.5 నుంచి రూ.500 వరకు పలుకుతున్నది. కానీ పతంగులు ఎగురవేసేటప్పుడు పెద్దలు చిన్నారులను గమనిస్తూ ఉండాలి. చట్టూ గోడలు లేని డాబాలు, ప్రహరీలేని ఖాళీ ప్రదేశాలు, రైలు పట్టాలు, ప్రధాన రహదారుల పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఎగురవేయకుండా జాగ్రత్త పడాలి.
అశ్వారావుపేట టౌన్, జనవరి 14 : సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేల బరులు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్నిచోట్ల పందేలు ప్రారంభమయ్యాయి. ఏపీలోని కామయ్యపాలెం, రాసన్నగూడెం, జీలుగుమిల్లి, తాటాకుల గూడెం, జంగారెడ్డిగూడెం, శ్రీనివాసపురం, బొర్రంపాలెం, అడ్డరోడ్డు, దేవులపల్లి, తిరుమలదేవిపేట, టి.నర్సాపురం, కామరకోట, పూచికపాడు, బుట్టాయిగూడెం, ఏలూరు, లక్కవరం, భీమవరం, తాడేపట్టిగూడెం, గౌరీదేవిపేట, జి.కొత్తపల్లి, దూపచర్ల, గణపవరం, చేబ్రోలు, మలసాని కుంట, రాళ్లకుంట, ద్వారకా తిరుమల, మార్టేరు, కోడేరు, రాయుడుపాలెం, పెరికిగూడెం, దెందులూరు, కుప్పాక, పత్తెపురం, సీతలి, తిరువూరు, విస్సన్నపేట, నిడమనూరు, గుడివాడ ప్రాంతాల్లో బోగి, సంక్రాంతికి జోరుగా కోడి పందేలు జరుగుతాయి. పందేలు రూ.500 నుంచి రూ.లక్షల్లో ఉంటాయి.