రఘునాథపాలెం, జూలై 6: ఖమ్మం నగరానికి చెందిన సురేశ్కు 20 ఏళ్లు. డ్రైవింగ్ వచ్చు. లైసెన్స్ తీసుకోవాలంటే ఎంతోకొంత ఖర్చవుతుంది. ఆ మొత్తం లేకపోవడంతో లైసెన్స్ తీసుకోలేకపోయాడు. ఇది సురేశ్ ఒక్కడి సమస్య మాత్రమే కాదు. నిరుపేద కుటుంబాలకు చెందిన అనేకమందిదీ ఇదే పరిస్థితి. ఖమ్మం నియోజకవర్గంలోని ఇలాంటి వారందరికీ రూపాయి ఖర్చు కూడా లేకుండా.. అన్నీ తానే (పువ్వాడ ఫౌండేషన్) భరించి, అర్హులందరికీ ఉచితంగా లైసెన్స్ ఇప్పించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కార్యాచరణకు దిగారు. ఒక్కో రోజున ఒక్కో డివిజన్లోని వారికి, రఘునాథపాలెం మండలంలోని వారికి లైసెన్స్ ఇచ్చేందుకు షెడ్యూల్ను జిల్లా రవాణా శాఖ అధికారి తోట కిషన్రావు ప్రకటించారు.
ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వేదికగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా శుక్రవారం ప్రారంభమవుతుందని, సెప్టెంబర్ 23 వరకు కొనసాగుతుందని తెలిపారు. శుక్రవారం నుంచి సెప్టెంబర్ 20 వరకు ఖమ్మం నగరంలోని వారికి, సెప్టెంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు రఘునాథపాలెం మండలంలోని వారికి లైసెన్స్ మేళా ఉంటుందని జిల్లా రవాణా శాఖ అధికారి వివరించారు. క్యాంప్ ఆఫీస్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. చిరునామా ధ్రువీకరణకు ఆధార్/ఓటర్ కార్డ్/బ్యాంక్ పాస్బుక్/పాస్పోర్ట్, పుట్టిన తేదీ ధ్రువీకరణకు పదోతరగతి మెమో/పాన్ కార్డ్/పాస్పోర్ట్లలో ఏదో ఒకటి తెచ్చుకోవాలని వివరించారు.