కొత్తగూడెం క్రైం, ఫిబ్రవరి 26 : పేలుడు పదార్థాలను కొనుగొనడంలో ప్రత్యేక శిక్షణ పొందిన తర్వాత జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలం దియాను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. దియాకు హ్యాండ్లర్గా వ్యవహరిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ మహేందర్, ఇతర డాగ్ స్కాడ్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు.
జిల్లా పోలీస్ శాఖలో పని చేస్తున్న 11 పోలీస్ జాగిలాలకు సంబంధించిన పూర్తి వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాగిలాల సంరక్షణ, వసతి ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ విజయ్బాబు, అడ్మిన్ ఆర్ఐ బోలెం రవి, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, హోం గార్డ్స్ ఆర్ఐ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.