ప్రభుత్వ బడులకు ‘స్మార్ట్’ హంగులు
ఇప్పటికే వందలాది బడుల్లో పరికరాలు
మన ఊరు- మన బడి’తో బోధన పద్ధతుల్లో మార్పులు
సాంకేతిక పరికరాలు సమకూర్చేందుకు చర్యలు
ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 7: గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచం ఒక కుగ్రామం. ఈ స్పీడ్ను రేపటి తరం అందుకోవాలంటే విద్యావ్యవస్థలో మార్పులు రావాలి. విద్యార్థులు సులభంగా శాస్త్ర, సాంకేతిక, విజ్ఞానశాస్ర్తాలను అధ్యయనం చేయాలి.. అందుకు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణ జరగాలి.. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ‘మన ఊరు- మన బడి’ని అమలు చేయనున్నారు. విద్యాశాఖ బడుల్లో సాం కేతికతను సమకూర్చే దిశగా అడుగులు వేస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధన పద్ధతుల్లో సమూల మార్పులు రానున్నాయి.
మూవబుల్ ప్రొజెక్టర్తో లాభాలు..
ప్రతి బడికి ఒక ప్రొజెక్ట్ర్, కంప్యూటర్ సమకూరుతుంది. అందుకు ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. మూవబుల్ ప్రొజెక్టర్ను పాఠశాలలలో ఏ తరగతికైనా తీసుకెళ్లొచ్చు. విండోస్- 10 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఈ ఎక్విప్మెంట్లో డిజిటల్ పెన్ కూడా ఉంటుంది. దీని సాయంతో ఉపాధ్యాయులు బోర్డుపై రాస్తూ పాఠాలు చెప్పొచ్చు. ఈ పద్ధతిలో వర్చువల్ రియాలిటీ తరహాలో బోధించేందుకు అవకాశం ఉంది. పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. దీంతో విద్యార్థులు తమకు నచ్చిన పాఠాలను సులభంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. దృశ్యమాధ్యమం ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తే సులభంగా నేర్చుకోగలుగుతారని అంతర్జాతీయంగా అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
హార్డ్ డిస్క్ కూడా…
ఎస్ఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) ద్వారా ప్రభుత్వం డిజిటల్ బోధనకు ఇప్పటికే అకాడమీ బుక్స్ సిద్ధం చేసింది. 6 నుంచి 10వ తరగతి వరకు హిందీ మినహా మిగిలిన ఐదు సబ్జెక్ట్ల పాఠాలు ఆన్లైన్, ఆఫ్లైన్, టీవీ డిజిటల్ పాఠాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిపై ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో పట్టుసాధించి విద్యార్థులకు బోధిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వీటిని పెన్డ్రైవ్ లేదా సీడీ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు తిరిగి అధ్యయనానికి వినియోగించుకోవచ్చు.
డిజిటల్ తరగతుల ప్రత్యేకతలు ఇవీ..
పాఠ్యాంశాల బోధనకు టెక్నాలజీని జోడిస్తే పిల్లలు ఆసక్తిగా పాఠాలు వింటారు. సులభంగా అర్థం చేసుకుంటారు. తరగతుల వారీగా విషయ నిపుణులు డిజిటల్ పాఠ్యాంశాలను రూపొందించడంతో బోధన నాణ్యంగా ఉంటుంది. బోధిస్తున్నప్పుడు పాఠం అర్థం కాని పక్షంలో అవసరమైతే ఉపాధ్యాయులు వీడియోను ఆపి బోధించేందుకు అవకాశం ఉన్నది. ఇప్పటికే విద్యార్థులు టీవీ మాధ్యమం ద్వారా పాఠాలు వినడం అలవాటు చేసుకున్నారు. డిజిటల్ తరగతులను ఆఫ్లైన్లో ఎలా వినాలి.. ఆన్లైన్లో ఎలా వినాలి.. అనేది విద్యార్థులకు అవగాహన వచ్చింది. డిజిటల్ తరగతులు అమలైతే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య అమాంతం పెరగనున్నది. తొలుత ఖమ్మం జిల్లాలోని కేవలం 29 స్కూల్స్కు మాత్రమే డిజిటల్ తరగతుల అనుమతులు వచ్చాయి. దాతలు సాంకేతిక పరికరాలు అందించడానికి ముందుకు రావడంతో ప్రస్తుతం వాటి సంఖ్య 150కి చేరింది. ప్రస్తుతం జిల్యావ్యాప్తంగా టీవీలు ఉన్న స్కూల్స్ 140 ఉన్నాయి. త్వరలో మరో 25 స్కూల్స్లో డిజిటల్ విధానం అందుబాటులోకి రానున్నది. డిజిటల్ తరగతులకు అనువుగా ఉన్న పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రోజుకు కొంత సమయం కేటాయించి ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు.
సెబ్జెక్టుల వారీగా..
డిజిటల్ బోధనలో సైన్స్, సోషల్ సబ్జెక్ట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గణితంలో రేఖా గణితం, సాంఖ్యశాస్త్రం పాఠాల్లోని అంశాలను త్రీడీ రూపంలో చూపించడం ద్వారా విద్యార్థులు సులభంగా నేర్చుకుంటారు. సైన్స్లో ఎనాటమీ, సముద్రాలు, ఇంకుడు గుంతలు, చెట్లు, అడవుల సంరక్షణ గురించి చెప్పడానికి డిజిటల్ తరగతులు ఉపయోగపడతాయి. సాంఘిక శాస్త్రంలో జాగ్రఫీ వివరించడానికి వీలుగా ఉంటుంది.
విద్యార్థులకు నాణ్యమైన విద్య..
ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ తరగతుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. మున్ముందు అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు బలోపేతం అవుతాయి. విద్యార్థులు నాణ్యమైన విద్య అందుకుని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు.
– కనపర్తి వెంకటేశ్వర్లు, హెచ్ఎం, రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఖమ్మం