ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 26: ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ షురూ అయ్యింది. తొలుత గ్రేడ్-2 పీజీ హెచ్ఎంల ఉద్యోగోన్నతుల భాగంగా ఖమ్మం జిల్లా పరిధిలోని ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో పనిచేస్తున్న నిబంధనల ప్రకారం అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను ఎంపిక చేశారు. వీరికి సంబంధించిన ఎస్ఆర్(సర్వీస్ రిజిస్టర్)ల పరిశీలన ప్రక్రియను నగరంలోని పాత డీఈవో కార్యాయలంలో గురువారం నిర్వహించారు.
ప్రధానోపాధ్యాయులు జీ రమేష్, పీ నారాయణ, గాయత్రి, వీరభధ్రరావు, శైలజాలక్ష్మి, జీవీబీ నారాయణరావు ఎస్ఆర్లు, చెక్ లిస్ట్లను పరిశీలించారు. విద్యార్హతల సర్టిఫికెట్స్, పీహెచ్సీ సర్టిఫికెట్, స్పెషల్ కేటగిరి, కుల, మెరిట్ సర్టిఫికెట్స్ పరిశీలించారు. తొలిరోజు ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో పనిచేస్తున్న 243 మంది స్కూల్ అసిస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏడీ ఎం వెంకటేశ్వరచారి, డీసీఈబీ సెక్రటరీ నారాయణ, సూపరింటెండెంట్ చావా శ్రీనివాసరావు, ఏపీవో నరుకుళ్ళ శ్రీనివాసరావు, గండపనేని నందకిశోర్, మాలోత్ దేవేందర్కుమార్, యర్రమల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఖమ్మంలో 80 గ్రేడ్-2హెచ్ఎంల ఖాళీలు
గ్రేడ్-2 హెచ్ఎం పోస్టు జోనల్ పరిధిలో ఉంది. మల్టీజోన్-1 పరిధిలో ఖమ్మం జిల్లాతో కలుపుకుని 19 జిల్లాలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలల్లో -97, లోకల్బాడీ పాఠశాలల్లో 997 మొత్తంగా 1094 ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో -6. లోకల్ బాడీ పాఠశాలల్లో 74 మొత్తంగా 80 ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రేడ్-2 పీజీహెచ్ఎంగా ఉద్యోగోన్నతి పొందేందుకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం అర్హతలు కలిగిన స్కూల్ అసిస్టెంట్లను ఖమ్మం జిల్లాలో 1:3 నిష్పత్తిలో లోకల్బాడీ నుంచి వివిధ కేటగిరిల నుంచి 317 మందిని ఎంపిక చేయగా, ప్రభుత్వ పాఠశాలల నుంచి వివిధ కేటగిరిల నుంచి 49 మందితో జాబితాను ప్రకటించారు.
20 అప్పీళ్ళు..
గ్రేడ్-2 పీజీ హెచ్ఎం ఉద్యోగోన్నతి కోరకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం తమకు అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేదని విద్యాశాఖాధికారులకు అప్పీల్ చేసుకున్నారు. సుమార్ 20మంది స్కూల్ అసిస్టెంట్లు అప్పీళ్ళు చేసుకున్నారు. అప్పీళ్ళను పరిశీలించిన అధికారులు వీరిలో నిబంధనల ప్రకారం ఉన్నవారిని జాబితాలో పోందుపరచచడంతో పాటు అప్పీళ్ళను ఆర్జేడీకి నివేధించనున్నారు.