తల్లాడ, మే 19 : సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలను రూ.వెయ్యి కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే సండ్ర వెంటకవీరయ్య తెలిపారు. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన ఈ నిధులతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దామని అన్నారు. మండలంలో 48 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.48 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి తల్లాడలో శుక్రవారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, గడిచిన నాలుగు నెలల్లో ఒక్క తల్లాడ మండలంలోనే రూ.వంద కోట్లతో అభివృద్ధి పనులను జరిగాయని అన్నారు. చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రభుత్వ కృషి వారికి అర్థమయ్యేలా వివరిస్తామని అన్నారు. ఇందుకోసం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ నెల 27 నుంచి కార్యకర్తలతో సమష్టి సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆయా గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలిసేలా పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రామానుజవరంలో సర్పంచ్ శీలం కోటారెడ్డి ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అభినందించారన్నారు. రామానుజవరంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల హోర్డింగులను అన్ని గ్రామాల్లో జూన్ 2 నాటికి ఏర్పాటు చేయాలని నాయకులకు సూచించారు. తల్లాడ గ్రామ పంచాయతీకి రూ.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేస్తామని అన్నారు. తల్లాడ మండలంలోని బస్వాపురం నుంచి అశ్వారావుపేట, పినపాక నుంచి రంగంబంజర వరకు ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించానమన్నారు. కుర్నవల్లిలో కుర్నవల్లి – ఉమ్మడదేవరపల్లి రోడ్డు, కుర్నవల్లి – పుణ్యపురం రోడ్డు నిర్మాణానికి, వాగుపై లోలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అన్నారు.
వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ప్రతి గ్రామానికీ ఒక వీఆర్ఏను కేటాయించి మిగిలిన వారిని వివిధ శాఖల్లో కేటాయిస్తామన్నారు. 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను నియోజకవర్గంలో కన్నులపండుగగా నిర్వహించాలన్నారు. ఏ రోజు ఏఏ కార్యక్రమాలు చేపట్టాలో తెలియజేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, గంటా శ్రీలత, రెడ్డెం వీరమోహన్రెడ్డి, దుగ్గిదేవర వెంకట్లాల్, దూపాటి భద్రరాజు, సురేశ్, అయిలూరి ప్రదీప్రెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, బద్ధంకోటిరెడ్డి, నాయుడు శ్రీనివాసరావు, దిరిశాల దాసురావు, జొన్నలగడ్డ కిరణ్బాబు, అయిలూరి లక్ష్మి, కోసూరి వెంకటనరసింహారావు, తూము శ్రీనివాసరావు, పొట్టేటి సంధ్యారాణి, మువ్వా మురళి, వజ్రాల రామిరెడ్డి, గుండ్ల వెంకటి, కాంపాటి జమలయ్య, ఇంజం కృష్ణార్జునరావు, పోతురాజు వెంకటయ్య, గరిడేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వీఆర్ఏల సన్మానం
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను వీఆర్ఏల సంఘం నాయకులు సన్మానించారు. వీఆర్ఏల సమస్యలను అసెంబ్లీలో అనేక సందర్భాల్లో తెలియజేసి వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వీఆర్ఏలు మైనుద్దీన్, జానీ, శ్రీను, చంద్రకళ, లూర్థు తదితరులు పాల్గొన్నారు.