కొత్తగూడెం సింగరేణి, ఏప్రిల్ 11 : లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వని రిటైర్డ్ ఉద్యోగులు వెంటనే మొబైల్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారా సమర్పించి సీపీఆర్ఎంఎస్ కార్డును రెన్యువల్ చేయించుకోవాలని సింగరేణి డైరెక్టర్(పా), ట్రస్టీల అధ్యక్షుడు ఎన్వీకే శ్రీనివాస్ అన్నారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు సంబంధించి సీపీఆర్ఎంఎస్ ఎన్ఈ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2022-23 ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆడిట్ రిపోర్టును ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పస్ ఫండ్కు రావాల్సిన కంట్రిబ్యూషన్ అమౌంట్ కన్నా తక్కువగా ఉన్నదని, అన్ని ఏరియాల గనులు, డిపార్ట్మెంట్లకు తెలిపినా కొందరు మాత్రమే షార్ట్ ఫాల్ అమౌంట్ చెల్లించారని తెలిపారు. ఇంకా 300 మంది చెల్లించలేదని, రెండు నెలల్లో చెల్లించకపోతే వారి మెడికల్ కార్డులు తాత్కాలికంగా బ్లాక్ చేస్తామని పేర్కొన్నారు. గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందే ఉద్యోగులకు విరమణ రోజే సీపీఆర్ఎంఎస్ ఎన్ఈ మెడికల్ కార్డు ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్కుమార్, జీఎం పర్సనల్ బసవయ్య, కవితానాయుడు, జీఎం ఐటీ రాంకుమార్రావు, సురేశ్బాబు, సీఎంవో డాక్టర్ సుజాత, కంపెనీ సెక్రటరీ సునీతాదేవి, ఏజీఎం శ్రీనివాసరావు, ప్రాజెక్టు మేనేజర్ హరిప్రసాద్ పాల్గొన్నారు.