కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 21: సింగరేణి పరిధిలో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులతో పాటు 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి తక్షణం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో బుధవారం సింగరేణీ సీఎండీ బలరాం, డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ పరిధిలో నిలిచిన కారుణ్య నియామక ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకైనా ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
వారసుల వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంపై సంస్థ సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండానే కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా కల్పించే దిశగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎండీ సమాధానమిచ్చారు. అనంతరం డిప్యూటీ సీఎం కొత్తగూడెంలో నిర్మించిన 10.5 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్ను ఈ నెల 26న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.