భద్రాచలం, మార్చి 23: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వసంత పక్ష తిరుకల్యాణ పుష్కరోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరగనుంది. ఇందులో భాగంగా రామాయణ మహాక్రతువును రుత్వికులు, అర్చకులు గురువారం శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. ఉదయం స్వామివారి ఉత్సవ పెరుమాళ్లు, నిత్య కల్యాణ మూర్తులకు ఏకాంతంగా అభిషేక తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవ మూర్తులతో ఆలయ ప్రదక్షిణ నిర్వహించి, ద్వాదశ కుం డాత్మక యాగశాలకు తీసుకొచ్చారు. రెండు యాగశాలల్లో ఒకచోట వేద హోమం, మరోచోట రామాయణ హవనం జరిపారు.
రామాయణ మహాక్రతువులో భాగంగా 12 హోమ గుండాల్లో హోమం నిర్వహించారు. యజ్ఞ రక్షకునిగా గరుత్మంతుడిని ఆవాహన చేసి గరుడ ధ్వజారోహణం చేశారు. 12 కలశాల్లో 12 మంది దేవతలను ఆవాహన చేశారు. ముందుగా రుత్వికులు అగ్ని మథనం నిర్వహించారు. చతుర్వేద హవనాలు, రామాయణ హవనం, శ్రీరామ షడక్షరీ, నారాయణ అష్టాక్షరీ మంత్ర హోమాలు, చతుష్ఠానార్చన చేశారు. ద్వాదశ కుండాత్మక హోమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వేద పండితులు సామూహిక సంక్షేప రామాయణ పారాయణం చేశారు. నిత్య పూర్ణాహుతి, పురోడాశ, ప్రసాద వినియోగం జరిపారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం, రామాయణ మహాక్రతు హోమాలు నిర్వహించారు. రామాయణ ప్రవచనం చేశారు. రాత్రి 8.00 గంటలకు నిత్య పూర్ణాహుతి, ఆవధారయలు, ప్రసాద వినియోగం జరిపారు.