ఖమ్మం, ఫిబ్రవరి 18 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని బచ్చోడు గ్రామానికి చెందిన గుజ్జ నాగయ్య కుమారుడు గుజ్జ రామకృష్ణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుపై తనకున్న అభిమానాన్ని వినూత్నరీతిలో చాటిచెప్పాడు. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన కృషి, కేసీఆర్ పదేండ్లలో రాష్ర్టానికి చేసిన అభివృద్ధికి మంత్రముగ్ధుడై కేసీఆర్ 70వ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ చిత్రపటాన్ని తన గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నాడు.
కేటీఆర్, కేసీఆర్తో కలిసి ఫొటో దిగాలని పలుమార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదని ఎలాగైనా వారిని కలిసి వారితో ఫొటో దిగుతానని ఆదివారం ఖమ్మం వచ్చిన రామకృష్ణ పేర్కొన్నాడు. తెలంగాణ భవనంలో ఓసారి ప్రయత్నించినా కుదరలేదని, ఇటీవల జరిగిన నల్గొండ సభలో ప్రయత్నించినా ఫొటో దిగడం కుదరలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. జీవితంలో ఒకసారైనా కేసీఆర్, కేటీఆర్ను కలిసి వాళ్లతో ఫొటో దిగడమే తన కోరిక అని తెలిపారు. రామకృష్ణతోపాటు గుజ్జ సతీశ్, అనపర్తి కొండలు, గుజ్జ కొండలు ఉన్నారు.