ఖమ్మం, సెప్టెంబర్ 16: తెలంగాణ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటు నూతన భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి బాబా సాహెబ్ పేరు పెట్టడం, అసెంబ్లీ తీర్మానం చేసి జీవో జారీ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇందుకుగాను జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గురించి తెలియని బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. అనేక వక్రభాష్యాలు చెబుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారి పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో గానీ, తెలంగాణ సాయుధ పోరాటంలోగానీ, స్వరాష్ట్ర పోరాటంలోగానీ బీజేపీ పాత్ర ఏమీ లేదని, చరిత్రలో కనీసం ఒక్క పేజీ కూడా లేదని స్పష్టం చేశారు. అలాంటి ఆ పార్టీ ఇప్పుడు చరిత్రను వక్రీకరిస్తోందని మంత్రి మండిపడ్డారు. రెండు రోజులకు ఒకరు చొప్పున హైదరాబాద్కు వస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణకు ఏమి తెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట ఇస్తే తప్పేవారు కాదని ఇప్పుడు మరోసారి రుజువైందని గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క కోరిన విధంగా ఎలాంటి భేషజాలకు పోకుండా పార్లమెంట్ నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానం చేశామని అన్నారు. ఇదే క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ నూతన సచివాలయానికీ అంబేద్కర్ పేరు పెట్టామని, జీవో కూడా జారీ చేశామని అన్నారు. మరి ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. అంబేద్కర్ బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను సాధిస్తున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. నూతన సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారని అన్నారు. పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్కుమార్, కూరాకుల నాగభూషణం, చింతనిప్పు కృష్ణచైతన్య, బొమ్మెర రామ్మూర్తి, తొగరు భాస్కర్రావు, కొప్పుల ఆంజనేయులు, డోకుపర్తి సుబ్బారావు, షేక్ షకీనా తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం..
తెలంగాణ సచివాలయానికి బాబా సాహెబ్ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు కలిసి తెలంగాణ భవన్లో అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.