భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఆధునిక యుగంలో సాంకేతికత రోజురోజుకూ మారిపోతున్నది. ఈ సాంకేతికత ఇప్పుడు మనకు నచ్చిన ఫుడ్ను ఇంటికే తెచ్చిపెట్టే రోజులు వచ్చేశాయి. ఎక్కడో మహానగరాలకే పరిమితమైన ‘ఫుడ్ ఆర్డర్ కల్చర్’ నేడు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు ఏ వస్తువునైనా ఆర్డర్పై అతి తక్కువ రోజుల్లో వినియోగదారుడి ఇంటికి చేరుస్తుంటే.. ఇదే కోవలోకి ఫుడ్ సప్లయ్ చేసే కంపెనీలు జొమాటో, స్విగ్గీ పట్టణాల్లోని రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుని వినియోగదారుడికి నచ్చిన ఆహారాన్ని చేరవేస్తున్నది. జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల్లో ఈ కల్చర్ ఊపందుకున్నది. పెరిగిన నిత్యావసరాల ధరలు, ఇతరత్రా ఖర్చులతో ఇంటి భారం మరింత పెరిగిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు ఏదో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యువత తమకు నచ్చిన ఆహారం ఆర్డర్ చేసుకుని తిని ఎంజాయ్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలు సైతం ఆన్లైన్లో ఆహారం అర్డర్ వ్యాపారంపై దృష్టిసారించడంతో ఈ కల్చర్ మరింత వేగంగా చిన్న పట్టణాలకు కూడా పాకుతున్నది.
ఒకప్పుడు మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ నగరాలకే పరిమితమైన ఈ ఫుడ్ అర్డర్ కల్చర్ జిల్లాలకు, చిన్న పట్టణాలకు సైతం పాకింది. యువత ఎక్కువ ఉన్నచోట ఈ నాగరికత మరింత విస్తరించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం పట్టణాలలో జొమాటో సంస్థ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. చేతిలో సెల్ఫోన్ దానికి ఇంటర్నెట్ కనక్షన్ ఉంటే చాలు అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే. సెల్ఫోన్ ద్వారా తమకు ఇష్టమైన ఆహారాన్ని పొందవచ్చు. సెల్ఫోన్లో జొమాటో యాప్ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు…ఆ సంస్థకు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆర్డర్ అమౌంట్ చెల్లించి వినియోగదారుడు ఫుడ్ పొందవచ్చు. వినియోగదారుడు ఉన్న లొకేషన్కు అత్యంత వేగంగా ఆర్డర్ చేసిన ఐటం వచ్చిచేరుతుంది. దీంతో వినియోగదారుడు జొమాటో ద్వారా తమకు ఇష్టమైన ఫుడ్ అర్డర్ చేసే ఉత్సాహం కనబరుస్తున్నారు. ముఖ్యంగా యువత బర్త్డే పార్టీలు, వివాహ వార్షికోత్సవాల సమయంలో ఆన్లైన్ ఫుడ్ అర్డర్ చేస్తూ అతి సులువుగా తమకు ఇష్టమైన ఆహారాన్ని పొందుతున్నారు. కొత్తగూడెం పట్టణంలో రోజుకు సుమారు 350 ఆర్డర్లు, భద్రాచలంలో 200 ఆర్డర్ల ద్వారా ఒక్కో కంపెనీ వినియోగదారులకు అందిస్తున్నది. అంటే సుమారు నెలకు రూ.25 లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు లెక్క. కొత్తగూడెం, భద్రాచలం పట్టణాల్లో సుమారు 200 మంది డెలివరీ బాయ్స్ ఫుడ్ యాప్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు.
వినియోగదారుడు తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. ఇంతకు ముందులా హోటల్కి వెళ్లి అక్కడ ఆర్డర్ వచ్చేంత సేపు వెయిట్ చేయకుండా ఇప్పుడు అర్డర్ చేసిన క్షణాల్లో ఆహారం తమ దగ్గరకి వచ్చి చేరుతుంది. దీంతో పట్టణాల్లో బ్యాచిలర్స్ ఎక్కువగా ఆహారాన్ని తెప్పించుకుంటున్నారు. జొమాటో, స్విగ్గీ యాప్లు ఫోన్లో ఉంటే చాలు తాము ఉన్న లొకేషన్ను ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. యాప్ ఏయే రెస్టారెంట్లు దగ్గర్లో ఉన్నాయో సూచిస్తుంది. మనకు నచ్చిన ఐటం ఎక్కడ దొరుకుతుందో.. ఆ రెస్టారెంట్ మనకు ఎంతదూరంలో ఉంది ట్రాఫిక్ను బట్టి ఎంత సమయంలో అది మనకు చేరుతుందో కూడా యాప్ చూపిస్తుంది. ఆర్డర్ చేసిన అతి తక్కువ సమయంలోనే మన అర్డర్ మనకు వచ్చేస్తుంది.
ఆన్లైన్ వ్యాపారం మంచి క్లిక్ అయింది. దీనికి యూత్ బాగా అలవాటు పడ్డారు. టిఫిన్, భోజనం, ఎక్కువగా కర్రీస్ తెప్పించుకుంటున్నారు. ఒక్కోసారి కాలేజీ, స్కూల్ పిల్లలకు కూడా లంచ్బాక్స్ తీసుకెళ్లని రోజు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక్క ఫోన్ కొడితే చాలు నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతున్నాం. గతంలో రోజుకు రూ.వెయ్యి వచ్చేది. కొత్తగూడెంలో 180 మంది బాయ్లు ఉన్నారు. రోజూ రూ.500 పైనే వస్తుంది.
– కే శివరామకృష్ణ, జొమోటో బాయ్
ప్రస్తుత పరిస్థితుల్లో లైఫ్ ైస్టెల్ మారిపోయింది. బిజీ టైంలో అన్ని రకాల వంటలు మన కోసం ఇంట్లో చెయ్య రు. అందుకే ఖరీదైన టేస్టీ ఫుడ్ కోసం ఆన్లైన్ వాడుకుంటున్నా. హోటల్కి వెళ్లొచు. కానీ.. జర్నీ వల్ల రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. ఇంట్లో కూర్చొని ఆర్డర్ ఇస్తే చాలు క్షణాల్లో వచ్చేస్తుంది ఫుడ్. వెంటనే వేడివేడిగా తినొచ్చు. ఎంజాయ్ చెయ్యాలంటే ఒక్కోసారి ఆన్లైన్ ఆర్డర్ చెయ్యాల్సిందే.
– భవ్యశ్రీ, కాలేజీ విద్యార్థిని, కొత్తగూడెం కూలీలైన్
తల్లిదండ్రులకు ఉద్యోగమో, వ్యాపారమో ఉంటుంది. ఇంత బిజీ లైఫ్లో మనకు కావాల్సిన ఫుడ్ అందుబాటులో ఉండదు. అందుకే కనీసం సండే రోజున ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాను. ఇంట్లో అందరికీ ఉపయోగం ఉంటది. కుటుంబం అంతా హోటల్కి వెళ్లాలంటే ఆటో కావాలి. జర్నీ ట్రావెలింగ్ ఖర్చు. అంతా వృథా తప్ప వేరే లేదు. అందుకే జొమాటోలో ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో నచ్చిన ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది.
– డి.దేహిత్రాజా, బాబూక్యాంపు, కొత్తగూడెం