అశ్వారావుపేట, నవంబర్ 1 : రైతు సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆయిల్పాం రైతుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సీఎం కేసీఆర్ సహకారం తీసుకుంటానని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయిల్పాం రైతు సంఘం బాధ్యులతో సమావేశం నిర్వహించారు. పంట సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మొక్కలు తీసుకోవడం నుండి ఫ్యాక్టరీలకు పంట తరలింపు వరకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యేకు ఏకరువు పెట్టారు. అనంతరం రైతులనుద్దేశించి ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గంలోనే ఎక్కువగా ఆయిల్పాం సాగు కావడం పట్ల సీఎం కేసీఆర్ పూర్తి సంతృప్తితో ఉన్నారని, రాష్ట్రం మొత్తం మన నియోజకవర్గం వైపు చూస్తుందని కితాబునిచ్చినట్లు వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని, సమస్యల పరిష్కారం కోసం సీఎం వద్దకు రైతులను తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసానిచ్చారు. ఆయిల్పాం సాగు ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నారని, రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగును విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆయిల్పాం సాగు వల్ల రైతులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలను సీఎం అంచనా వేయడంతోపాటు సాగు ప్రోత్సాహానికి రాయితీ పథకాలు అమలు చేస్తున్నారని, మొక్క మొదలు, సాగు ఖర్చులు, డ్రిప్ సదుపాయానికి కూడా ప్రభుత్వం సబ్సిడీలు మంజూరు చేస్తుందని చెప్పారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ఫాం ఫార్మర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, కార్యదర్శి కోటగిరి సీతారామస్వామి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ జూపల్లి రమేశ్, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, వైస్ ఎంపీపీ చిట్లూరి ఫణీంద్ర, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, అశ్వారావుపేట
సొసైటీ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, సంఘం డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
పోడు భూముల సర్వే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా.. పారదర్శకంగా జరుగుతున్నదని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గిరిజనులకు స్పష్టం చేశారు. దమ్మపేట మండలం మారప్పగూడెం పంచాయతీలోని కొత్తూరు గిరిజనులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిగి పోడు సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో విద్యాధర్రావు, తహసీల్దార్ చల్లా ప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.