అశ్వారావుపేట, జనవరి 20 అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పాదర్శకంగా సేవలు అందించేందుకు రాష్ట్ర సర్కార్ ఎన్హెచ్టీఎస్ (న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం) యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంగన్వాడీ టీచర్లు మాన్యువల్ పద్ధతికి స్వస్తి పలికి సేవలను ఎప్పటికప్పుడు ఈ ఆన్లైన్ చేయాల్సి ఉంది. యాప్ నిర్వహణపై ఇప్పటికే ఐసీడీఎస్ అధికారులు టీచర్లకు శిక్షణ సైతం పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రాజెక్టుల పరిధిలోని 2,060 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం ఈ విధానం అమలవుతున్నది. ఉమ్మడి పాలనలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకోవడం, లబ్ధిదారులకు సక్రమంగా సేవలు, పోషకాహారం అందకపోవడాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా కేంద్రాల నిర్వహణ, పోషకాహారం పంపిణీపై ఐసీడీఎస్ అధికారులు నెలవారీ సమావేశాలు నిర్వహిస్తుండడంతో లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,900 వరకు అంగన్వాడీ టీచర్లు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. పలు కారణాలతో సుమారు 160 టీచర్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. వీటి బాధ్యతలనూ సమీప కేంద్రాల టీచర్లు చూసుకుంటున్నారు. సేవలపై సూపర్వైజర్లు, సీడీపీవోలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ప్రయోజనాలు ఇవీ..
యాప్ డిజిటల్ మాధ్యమంలో ఉంటుంది కాబట్టి అంగన్వాడీ టీచర్లు నెల వారీ నివేదికలను సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. అన్ని రిజిస్టర్ల నిర్వహణ యాప్లోనే ఉంటుంది కాబట్టి ఉన్నతాధికారులు కేంద్రాలపై సమాచారం అడిగినప్పుడు తక్షణమే తెలసుకోవచ్చు. స్టాక్ నిర్వహణ, కచ్చితమైన పోషకాహార ఇండెంట్ రూపొందించవచ్చు.
వివరాల నమోదు ఇలా..
అంగన్వాడీ టీచర్లు గతంలో మాన్యువల్ పద్ధతిలో రికార్డులు నిర్వహించేవారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ను టీచర్లు తమ మొబైల్స్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్లో మొత్తం 14 రకాల ఆప్షన్లు ఉంటాయి. సెంటర్లకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, ప్రీ స్కూల్ పిల్లల హాజరును ఏరోజుకారోజు నమోదు చేయాల్సి ఉంటుంది. గర్భిణులకు అందించే ప్రతి సేవ రికార్డ్ చేయాలి. ప్రభుత్వ సూచనల మేరకు చిన్నారుల బరువు, ఎత్తును నిర్ణీత సమయాల్లో కొలిచి యాప్లో నమోదు చేయాలి. గర్భిణులకు రక్త పరీక్షల నిర్వహణ, రక్త హీనత బాధితుల వివరాలు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఒక నెలలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే సేవలు, మిగిలిన సరుకులు, మౌలిక వసతులు, భోజన వసతి, పిల్లలకు ఇచ్చే రేషన్, ఖర్చులు, సామగ్రి, టీకాల షెడ్యూల్ వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి అవసరమైన సామగ్రిని టీచర్లు ఆన్లైన్లో ఐప్లె చేసుకునే వెసులుబాటు ఉంది. సర్వే, సారాంశం, శాశ్వత వినియోగ వస్తువులు, ఆరోగ్యలక్ష్మి వంటి సేవలూ యాప్ పరిధిలోకి తీసుకొస్తే పూర్తిస్థాయి సేవలు ఇక యాప్ పరిధిలోనే ఉంటాయి.
సేవల్లో పారదర్శకత..
ఎన్హెచ్టీఎస్ యాప్తో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే సేవల వివరాలు ప్రభుత్వానికి పారదర్శకంగా అందుతాయి. లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందుతాయి. ముఖ్యంగా పౌష్టికాహారం, సరుకుల పంపిణీ విషయంలో అవకతవకలకు తావు ఉండదు. యాప్తో ఉన్నతాధికారుల పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. టీచర్లకూ పనిభారం తగ్గుతుంది. యాప్ నిర్వహణపై ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు శిక్షణ సైతం ఇచ్చాం.
– రోజారాణి, సీడీపీవో, అశ్వారావుపేట