కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 23 : సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల పేరుతో కొత్తగా విధుల్లో చేరిన యువ కార్మికులు విధులకు అకారణంగా డుమ్మా కొడుతూ డిస్మిస్ పాలవుతున్నారు. వీరి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుండడంతో తల్లిదండ్రుల ఆశలు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం నీరుగారుతున్నది. వివరాల్లోకెళ్తే.. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు కల్పించాలనే ధ్రుఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ కారుణ్య నియామకాల పేరుతో సింగరేణి కార్మికుల కలను నిజం చేశారు. దీంతో ఆంధ్రా ముఖ్యమంత్రి, జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన పూర్వ వైభవం మళ్లీ రావడంతో కేసీఆర్కు కార్మికలోకం రుణపడి ఉంది.
అయితే తమ పిల్లలు సింగరేణి నౌకరీలు చేసి బాగుపడతారన్న తల్లిదండ్రుల ఆశలు నిరాశగానే మిగిలిపోతున్నాయి. కారుణ్య నియామకాల ద్వారా మెడికల్ బోర్డులో అన్ఫిట్ అయిన కార్మికులు తమ పిల్లలకు సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పించారు. వారు సక్రమంగా పని చేసుకొని భవిష్యత్తులో బాగుపడతారని, ఆర్థికంగా నిలదొక్కుకొని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకొని, అటు సింగరేణికి, ఇటు తల్లిదండ్రులకు మంచిపేరు తెస్తారని ఆశపడ్డారు. అయితే యువ కార్మికుల తీరు తల్లిదండ్రులను బాధకు గురిచేస్తున్నది. సింగరేణిలో పని చేస్తున్న కార్మికులు ఎలాంటి కారణాలు లేకుండా గైర్హాజరైతే మూడు దఫాలుగా కౌన్సిలింగ్ నిర్వహించి తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటారు.
ఎన్నిసార్లు కౌన్సిలింగ్ చేసినా తమ పద్ధతి మార్చుకోకపోతే విధుల నుంచి తప్పిస్తారు. తరచూ గైర్హాజరయ్యే కార్మికులకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఉద్యోగం కోల్పోతే జీవితంలో పడాల్సిన దుర్భర స్థితిని వివరిస్తారు. తమ పద్ధతులను మార్చుకోవాలని చెబుతారు.. అప్పటికీ తీరు మారకపోతే చార్జిషీట్ ఇచ్చి గైర్హాజరైన కారణాలకు సరైన సమాధానాలు ఇవ్వాలని సూచిస్తారు. అయినా స్పందించకపోతే వారిని డిస్మిస్ చేస్తారు. ఇలా కేవలం 2021వ సంవత్సరంలో 48 మంది డిస్మిస్ అయ్యారు. ఎలాంటి కారణం లేకుండా ఆబ్సెంట్ అయిన వారు 930మందిగా యాజమాన్యం గుర్తించింది. 699 మందికి చార్జిషీట్ ఇచ్చింది.
సరైన కారణాలు లేని గైర్హాజరు..
సింగరేణి సంస్థలోని భూగర్భ గనుల్లో పనులు చేయడం అప్పట్లో కష్టంగా ఉండేదని, ప్రస్తుతం ప్రతి మైన్ను మిషన్ మైనింగ్గా మార్చామని, యంత్రాలతోనే బొగ్గు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కార్మికులు ఎలాంటి కారణాలు లేకుండా విధులకు డుమ్మా కొట్టడం విస్మయం కలిగిస్తున్నదని అధికారులు వాపోతున్నారు. భూగర్భ గనులు, ఓసీలు, వివిధ డిపార్ట్మెంట్ల్లో ప్రమాదాలు జరగకుండా పూర్తి రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. గాలి, నీరు సక్రమంగా వచ్చేలా చేస్తున్నప్పటికీ గైర్హాజరు శాతం రోజురోజుకూ పెరిగిపోతున్నది. వారిలో ఎక్కువశాతం యువ కార్మికులే ఉండడం విశేషం. తీరు మారకుంటే ఎంతటి వారైనా డిస్మిస్ బారినపడక తప్పదని అధికారులు చెబుతున్నారు. కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు సాధించిన యువత ఎక్కువ శాతం ఉన్నత చదువులు చదివిన వారే. ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, డిగ్రీలతోపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం వాటిని వదులుకొని తండ్రుల ఉద్యోగాలను వారసత్వంగా అందిపుచ్చుకొని సింగరేణిలో కూడా ఉద్యోగం చేయాలనే సంకల్పంతో వచ్చారు. అయితే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు కృషి చేయకపోవడంతో తల్లిదండ్రుల ఆశలు అడియాశలవుతున్నాయి.
సింగరేణి ఉద్యోగం అదృష్టం
సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం ఆనందంగా భావించాలి. సీఎం కేసీఆర్ కృషి వల్ల ప్రస్తుతం యువత ఉద్యోగాలు పొందుతున్నది. ఈ మధ్యకాలంలో సింగరేణిలో యువత ఉద్యోగాలకు గైర్హాజరుకావడం బాధాకరం. ఉన్నత చదువులు చదవకపోయినా ఉద్యోగాలు కల్పించిన ఏకైక సంస్థ సింగరేణి మాత్రమే. యువత గతంలో వారు చేసిన సాఫ్ట్వేర్, ఇతర కంపెనీల్లో ఉద్యోగం చేసిన అలవాటు మానకపోవడం వల్లనే గైర్హాజరవుతున్నారు. అయితే యువ కార్మికులు చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇంటర్నల్ ద్వారా పొంది వారు అనుకున్న లక్ష్యాలు చేరుకునే అవకాశం సింగరేణిలో ఉంది. కార్మికులు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని తమ ఉద్యోగాలను కాపాడుకొని కుటుంబాలకు రక్షణగా నిలవాలి.
– ఆనందరావు, జీఎం పర్సనల్(ఐఆర్ అండ్ పీఎం)