ఖమ్మం : కవిత్వం సాహితీ రూపాలన్నిటిలో చాలా పదునైనదన్న భావనను, కవిత్వాన్ని యువతరానికి అందించి ,వారిలోని సృజనాత్మకతను వెలికితీసి ఈనాడు వందలాదిమంది వచన కవిత్వాన్ని పరిపుష్టం చేయడానికి కృషి చేసిన కుందుర్తిని స్మరించుకునేందుకు ఖమ్మంలోని ఎస్ ఆర్ ఎండ్ బీ కళాశాల వేదిక కానున్నది. ఖమ్మం కళాశాల తెలుగు విభాగం శత జయంతి సందర్భంగా డిసెంబర్16,17వ తేదీల్లో జాతీయ సదస్సు జరగనున్నది. వచన కవితా పితామహుడు, అభ్యుదయవాది కుందుర్తి ఆంజనేయులు శత జయంతి డిసెంబర్ 16న ప్రారంభం కానున్న సందర్బంగా ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.
ఈ సదస్సులో రెండు రాష్ట్రాల నుంచి వివిధ విశ్వవిద్యాలయ ఆచార్యులతో పాటు, బెంగళూర్, మద్రాస్, బనారస్ విశ్వవిద్యాలయం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన 80 మంది తెలుగు అధ్యాపకులు కుందుర్తి కవిత్వంలోని ప్రాధానత్యలను ఆయన చేసిన సాహిత్యకృషి తెలుగు కవిత్వంలో వచన కవితరూపాన్ని ఉద్యమంగా చేపట్టి జనాంకితం చేసిన తీరు తెన్నులకు పునర్మూల్యాంకనం చేయనున్నారు.
రెండు రోజుల సమావేశంలో కుందుర్తి సాహిత్య ప్రత్యేకతల్ని 9 విభాగాలుగా పత్ర సమర్పణలు ఆవిష్కరించేలా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కుందుర్తి శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, ఆధునిక తెలుగు కవిత్వానికి కుందుర్తి చేసిన కృషి, వచన కవితకు పర్యాయ పదంగా కుందుర్తి నిలిచిన తీరు, ఒక ప్రక్రియగా వచన కవిత్వం సుస్ధిరమైన అంశాలుగా, కొత్త వెలుగులతో వచన కవిత భవితను సదస్సులో చర్చించనున్నారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో ఖమ్మం నగరానికి ఓ ప్రత్యేక స్ధానమున్నది, ఆపరంపరంలో ఈ సదస్సు ఒక మైలురాయి కానున్నది. ఈ సదస్సుకు తెలుగు శాఖాధిపతి డాక్టర్ జరుపుల రమేష్ సంచాలకులుగా, సదస్సు కార్యనిర్వాక కార్యదర్శిగా ప్రముఖ కవి,కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్ సీతారం వ్యవహరించనున్నారు.