వైరా, సెప్టెంబర్ 23 : ఏన్కూరు మండలంలోని నూకలాంపాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ షార్ట్ఫిల్మ్కు జాతీయ అవార్డు లభించింది. ఈ అవార్డును సర్పంచ్ ఇంజం శేషగిరిరావు గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, పారిశుధ్యం, ఇతర కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న నిధులతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. అందులో భాగంగానే ఏన్కూరు మండలం నూకలాంపాడు ఇప్పటికే జిల్లాలోనే ఆదర్శంగా ఉంది. అయితే ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ కింద ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా షార్ట్ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నది. ఈ పోటీల్లో నూకలాంపాడు పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మించిన ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ షార్ట్ఫిల్మ్కు ద్వితీయ అవార్డు లభించింది.
ఖమ్మం జిల్లా నుంచి ఏన్కూరు మండలం నూకలాంపాడు, రఘునాథపాలెం మండలం రేగులచెలక, సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్మించిన ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ షార్ట్ఫిల్మ్లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. రాష్ట్రస్థాయిలో నూకలాంపాడు షార్ట్ఫిల్మ్ను దేశస్థాయికి ఎంపిక చేసి స్వచ్ఛ భారత్ సెంట్రల్ సెక్రటరీకి పంపించారు. దీంతో దేశస్థాయిలో నూకలాంపాడు షార్ట్ఫిల్మ్కు రెండో అవార్డు లభించింది. నూకలాంపాడు గ్రామం నూరుశాతం ఓడీఎఫ్ ప్లస్ గ్రామంగా ఉంది. మరుగుదొడ్ల నిర్మాణం, ఉపయోగం, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, పొడిచెత్త అమ్మడం ద్వారా గ్రామపంచాయతీ ఆదాయం సమకూర్చడం, తడిచెత్తను సేంద్రియ ఎరువుగా మార్చి రైతులకు అమ్మడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తడిచెత్తతో తయారు చేసిన సేంద్రియ ఎరువులను గ్రామపంచాయతీల నర్సరీలకు పల్లెప్రకృతి వనంలోని మొక్కలకు ఉపయోగిస్తున్నారు. గ్రామంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ను నిర్మూలించారు. అంతేకాకుండా గ్రామ ప్రజలకు స్వచ్ఛ భారత్, పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకు వాల్పెయింటింగ్లు వేయించారు. వీటన్నింటినీ కలిపి ప్రజలకు అర్థమయ్యే స్థానిక భాషలో సిని మా రూ పంలో షార్ట్ఫిల్మ్ను నిర్మించారు. ఈ షార్ట్ఫిల్మ్కు జాతీయ అవార్డు లభించింది. ఇదిలాఉండగా ఈ ఏడాది నూకలాంపాడు గ్రామానికి ఆదర్శ గ్రామపంచాయతీ అవార్డు కూడా లభించింది. ఈ అవార్డును గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న కలెక్టర్ గౌతమ్ చేతుల మీదుగా సర్పంచ్ శేషగిరిరావు అందుకున్నారు.
గతేడాది పమ్మికి ప్రత్యేక గుర్తింపు
గతేడాది ముదిగొండ మండలం పమ్మి గ్రామ పంచాయతీ నిర్మించిన షార్ట్ఫిల్మ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. పంచాయతీలో ద్రవ వ్యర్థాల నిర్వహణ, ఇంకుడుగుంతల వాడకంపై పల్లెపాట పేరుతో షార్ట్ఫిల్మ్ నిర్మించారు.
ప్రతి ఒక్కరికి అభినందనలు
పారిశుధ్య నిర్వహణలో దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మన జిల్లాకు మూడో ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ శాఖ కార్యదర్శులు, డీఆర్డీవో, డీపీవో, ప్రజాప్రతినిధుల సహకారం బాగా ఉంది. అన్ని మండలాల ప్రత్యేక అధికారులు పక్కాగా పనిచేశారు. స్వచ్ఛత పనిలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు.
– దురిశెట్టి అనుదీప్, కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం
జాతీయ అవార్డు గర్వకారణం
ఏన్కూరు మండలం నూకలాం పాడు గ్రామానికి షార్ట్ఫిల్మ్ విభాగంలో దేశస్థాయిలో రెండో బహుమతి రావడం వైరా నియోజకవర్గానికే గర్వకారణం. ఇప్పటికే నూకలాంపాడు గ్రామం అభివృద్ధి, పారిశుధ్యంతోపాటు, అన్ని విభాగాల్లో ఆదర్శంగా నిలిచింది. అవార్డు రావడానికి శ్రమించిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
– లావుడ్యా రాములునాయక్, వైరా ఎమ్మెల్యే
ఎంతో సంతోషాన్ని కలిగించింది
నూకలాంపాడు గ్రామానికి దేశస్థాయిలో రెండో అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ప్రతి పనిలో గ్రామస్తులు అండగా ఉండి సహకరించారు. ఎమ్మెల్యే రాములునాయక్ కృషితోనే మా గ్రామానికి అవార్డు దక్కింది.
– ఇంజం శేషగిరిరావు సర్పంచ్, నూకలాంపాడు