మంచిర్యాల జిల్లాలో కలకలం సృష్టించిన మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి ఆత్మహత్య ఘటనలో భర్తపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యను వేధించడం, గృహహింసకు గురిచేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కూసుమంచి/మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 8: మంచిర్యాలలో కలకలం సృష్టించిన జ్యోతి ఆత్మహత్య కేసులో పోలీసులు ఆమె భర్త మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై వేధింపులు, గృహహింస, ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలను ఆధారంగా చేసుకుని ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బుధవారం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత కుటంబసభ్యులకు ఆమె మృతదేహాన్ని అప్పగించారు. నిందితుడు బాలకృష్ణ స్వగ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని కేశవాపురం. మృతురాలి స్వగ్రామం ఇదే జిల్లాలోని కొణిజర్ల మండలం సీతారామపురం. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతిని వివాహం చేసుకున్నపుడు నిందితుడు కానిస్టేబుల్. వివాహం అయ్యాక బాలకృష్ణ మూడేళ్లు గ్రూప్స్నకు ప్రిపేరై కొలువు సాధించాడు.
దంపతులకు ఇద్దరు పిల్లలు రిత్విక (8), భవిత (6). ప్రస్తుతం బాలకృష్ణ మంచిర్యాల మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆ తర్వాత భార్యపై వేధింపులు ప్రారంభించాడు. మున్సిపల్ కమిషనర్గా పెళ్లి చేసుకుంటే తనకు రూ.5 కోట్లు కట్నం వచ్చేదని, భార్యను అదనపు కట్నం ఇవ్వాలంటూ వేధించేవాడు. ఇళ్లు కట్టుకుంటామంటే అత్తామామలు సొమ్ము ఇస్తామని మాట ఇచ్చారు. అనంతరం సంకాంత్రి పండుగకు జ్యోతి పుట్టింటికి వచ్చింది. సమయంలో అల్లుడు వేరొకరిని ఇంటికి తీసుకొచ్చినట్లు పొరుగున ఉండేవారు చెప్పినట్లు సమాచారం. దీనిపై జ్యోతి ప్రశ్నించడంతో బాలకృష్ణ కోపోద్రిక్తుడయ్యాడు. భార్యను చంపేందుకు పథకం రచించాడు. మంగళవారం ఉదయం జ్యోతి తల్లిదండ్రులకు కాల్ చేసి తన భర్త చంపేస్తాడని భయకంపితురాలైంది. భర్త ఇదే రోజు మధ్యాహ్నం జ్యోతి మృతిచెందినట్లు అత్తకు కాల్ చేసి చెప్పాడు. జ్యోతి మృతి విషయంలో ప్రాథమికంగా విచారించిన పోలీసులు ఆమెది ఆత్మహత్యగానే భావిస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు విచారిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్లోనే ఉన్నట్లు తెలిసింది.
కేశ్వాపురంలో ఉద్రిక్తత
కూసుమంచి, ఫిబ్రవరి 8: జ్యోతి మృతదేహాన్ని ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు బుధవారం కేశ్వాపురంలోని అత్తవారింటికి తీసుకొచ్చి ఆందోళన నిర్వహించారు. మృతురాలి స్వగ్రామమైన కొణిజర్ల మండలం సీతారామపురం గ్రామస్తులు భారీగా కేశ్వాపురానికి చేరుకున్నారు. మృతురాలి పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో నిందితుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. సమాచారం అందుకున్న సీఐ కంది జితేందర్రెడ్డి, కూసుమంచి ఎస్సై రమేశ్, నేలకొండపల్లి ఎస్సై స్రవంతి, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు.