తండాల్లోని గిరిజనులు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గిరిజనులను తన జేబులోని నోట్ల కట్టల్లా భావిస్తున్నాడని, ప్రజాక్షేత్రంలో ఆయనకు గుణపాఠం తప్పదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో రైతు దినోత్సవంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ను అడ్డం పెట్టుకుని ఆర్థికంగా ఎదిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారని, రాష్ట్రంలో బీఆర్ఎస్ను గద్దె దించడం ఎవరి తరం కాదని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఎంపీ నామా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని పేర్కొన్నారు.
– రఘునాథపాలెం, జూన్ 3
రఘునాథపాలెం, జూన్ 3: ప్రజాక్షేత్రంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గుణపాఠం ఖాయమని, వచ్చే ఎన్నికల సమయంలో అది తేలిపోతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ను అడ్డంగా పెట్టుకుని ఆర్థికంగా ఎదిగిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారని రాష్ట్రంలో బీఆర్ఎస్ను గద్దె దించడం ఎవరి వల్ల కాదన్నారు. తండాల్లోని గిరిజనులు బీఆర్ఎస్ వైపే ఉన్నారని, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గిరిజనులను తన జేబులోని నోట్ల కట్టల్లా భావిస్తున్నాడన్నారు. మున్ముందు ఈ గిరిజనులే ఎన్నికల్లో బుద్ధి చెప్తారన్నారు. పొంగులేటిని గిరిజనులు తండాల్లో అడుగు పెట్టనీయని రోజులు వస్తాయన్నారు. మండల ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారన్నారు. గిరిజనుల సహకారంతోనే తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్నాయని, ఒక్కో పార్టీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. కుట్రలు, కుతంత్రాలతో పట్టణాలు, గ్రామాల్లో పర్యటించే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రఘునాథపాలెం మండలాన్ని రాష్ర్టానికే రోల్ మోడల్ చేస్తానన్నారు.
సీఎం కేసీఆర్తోనే సమగ్రాభివృద్ధి
సీఎం కేసీఆర్ విజన్తోనే చిన్న తండాలు ఇప్పుడు పంచాయతీలుగా రూపాంతరం చెందాయన్నారు. కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేయించానన్నారు. త్వరలో నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తానన్నారు. ఎన్నికలు మొదలయ్యే నాటికి పంచాయతీ కార్యాలయాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానన్నారు. గిరిజన బిడ్డలు మంచి చదువులు చదవుకోవాలనే ఉద్దేశంతో జింకల తండాలో రూ.25 కోట్లతో ‘స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్’ నిర్మించా మన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కార్యకర్తలను కాపాడుంటు న్నానన్నారు. ఎంతోమందికి పదవులు ఇప్పించేలా చొరవ తీసుకున్నానని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతువేదికలు ఉండగా జిల్లాలో 129 ఉన్నాయన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు రూ.65 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబీమా ద్వారా రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తున్నామన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతును రారాజు చేసిందన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిందన్నారు. కార్యక్రమంలో డీఏవో విజయనిర్మల, జిల్లా సహకార అధికారిణి విజయకుమారి, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఖమ్మం ఏఎంసీ వైస్ చైర్మన్ అఫ్జల్, ఎంపీపీ భూక్యా గౌరి, రాంక్యా తండా సర్పంచ్ అమాలి, ఆత్మ చైర్మన్ లక్ష్మణ్నాయక్, పార్టీ నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, తారాచంద్, చిట్టెం నర్సింహారావు, కుమ్మరికుంట్ల కోటయ్య, బానోతు రవిప్రకాశ్, నందా, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం ఎంపీ నామా నాగేశ్వరరావు
గత ఎన్నికల సమయంలో విడుదల చేసిన మాని ఫెస్టోలో ప్రకటించని పథకాలనూ సీఎం కేసీఆర్ అమలు చేశారు. ఆయన విజన్తో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక పథకం చేరువైంది. సంక్షేమ పథకాలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష. వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయి. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయం. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి సాధించింది. గతంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేదని, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత తాగు,నీటి కష్టాలు లేవు. ఇప్పుడు కరెంట్ కోతలు కూడా లేవు.