టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఖానాపురంలో బుధవారం ఆయన పర్యటించారు. రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మరో రూ.20 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని, కేంద్రంలో ప్రతిపక్ష హోదా పోషించే స్థాయి లేకుండాపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ, సెప్టెంబర్ 28: టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ఖానాపురంలో బుధవారం పర్యటించిన ఆయన.. రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మరో రూ.20 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ హ్యాట్రిక్ గెలుపులో ఈసారి ఖమ్మం జిల్లా ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, బాలసాని లక్ష్మీనారాయణ, మొగిలి స్నేహలత, హరిప్రసాద్, పసుపులేటి దుర్గ, తుపాకుల యలగొండ స్వామి, శ్రీనివాసరావు, శిరీష, సూర్యనారాయణ, మాలోజి ఉష, వాచేపల్లి లక్ష్మారెడ్డి, పసుపులేటి వెంకట్, మందరపు ఎర్ర వెంకన్న, బత్తుల వీరారెడ్డి, మీగడ శ్రీనివాస్ యాదవ్, తోట ధర్మారావు, సిల్వరాజు, మాలోజి గోవింద్, నానబాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్షుడు లేని స్థితిలో కాంగ్రెస్
రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉందని, కేంద్రంలో ప్రతిపక్ష హోదా పోషించే స్థాయి నుంచి కునారిల్లిపోయిందని మంత్రి అజయ్ విమర్శించారు. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాని దుస్థితిలో ఆ పార్టీ ఉందని విమర్శించారు.
ఎచ్చులు చెప్పడంలో భట్టి దిట్ట: కమల్రాజు
ఎచ్చులు చెప్పడంలో ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చాలా దిట్ట అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. తాను చెప్పడం వల్లే సీఎం కేసీఆర్ ఆయా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని భట్టి చెప్పుకుంటున్నారని, అది సరికాదని అన్నారు.
అభివృద్ధిని చూడండి: తాతా మధు
తెలంగాణ రాకముందు ఉన్న దుస్థితిని, తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధిని పోల్చుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఒకప్పుడు దండగనుకున్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా చేసి చూపిస్తున్నారని అన్నారు.
పది సీట్లూ గెలిపించాలి: ఎంపీ వద్దిరాజు
తెలంగాణలోని పల్లెలు, పట్టణాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. కేంద్రం ఏ అవార్డులు ప్రకటించినా వాటిల్లో తెలంగాణ పల్లెలు, పట్టణాలే ముందువరుసలో ఉంటున్నాయని అన్నారు. తదుపరి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది స్థానాలనూ గెలిపించాలని పిలుపునిచ్చారు.