ఖమ్మం, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మా నిధులు మాకే.. మా ఉద్యోగాలు మాకే..’ అంటూ వలసవాదుల దోపిడీకి వ్యతిరేకంగా గర్జించిన జిల్లా.. ఖమ్మం. వివక్షపై పిడికిలెత్తి ‘జై తెలంగాణ’ అంటూ తొలికేక పెట్టింది ఖమ్మం. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు పురుడుపోసింది ఉద్యమ ఖిల్లా. సీమాంధ్ర కర్కషమూకలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడింది తెలంగాణ తొలి గుమ్మం. చారిత్రకపోరులో రక్తతర్పణంచేసి ఉద్యమానికే ఊపిరిపోసింది. 1969 నుంచి మలిదశ ఉద్య మం వరకు మడమతిప్పని పోరాటపటిమను ప్రదర్శించింది. అమరుల త్యాగాలను గుండెలకత్తుకున్న ఖమ్మంమెట్టు.. స్వరాష్ట్ర సాధన పోరులో అలుపెరగని పోరుచేసింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచింది. అంతటి ఘన చరిత్రను కలిగిన ఖమ్మం గడ్డపై మరో చరిత్రాత్మక ఘట్టానికి బీజం పడనున్నది. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తరువాత జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేలా అడుగులు వేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తొలి సభ నిర్వహణ కోసం ఖమ్మం గడ్డను ఎంచుకున్నారు. దీంతో మరో సరికొత్త చరిత్రకు ఇక్కడి నుంచే నాంది పలికింది.
సీమాంధ్ర పాలకుల వివక్షకు, వలసవాదుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిలా ‘జై తెలంగాణ’ అంటూ తొలికేక పెట్టింది. నిధులు, నీళ్లు, నియామకాల్లో వివక్షను తట్టుకోలేక 1969లోనే ‘జై తెలంగాణ’ నినాదం పెల్లుబికింది. స్వరాష్ట్రం, స్వపరిపాలన కోరుతూ ప్రత్యేక రాష్ట్ర నినాదానికే పురుడుపోసింది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఎందరో ముద్దుబిడ్డలు రక్తం చిందించారు. వీరుల త్యాగాలను పుణికిపుచ్చుకున్న పురిటిగడ్డ పోరుబిడ్డలు మలిదశ ఉద్యమంలోనూ మడమతిప్పలేదు. విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, ఉద్యమ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసు నిర్బంధాలను లెక్కచేయలేదు. ఉద్యోగులు పాలకుల బెదిరింపులను పక్కన పెట్టి, భావి జీవితాల కోసం జీవితాలనే (కొలువులనే) ఫణంగా పెట్టారు. తెలంగాణ సాధించే వరకు అలుపెరగని ఉద్యమాలు చేశారు. చివరకు అన్ని అడ్డంకులనూ, కుట్రలనూ ఛేదించుకొని తెలంగాణ బిల్లు దేశ రాజధాని సాక్షిగా పార్లమెంటులో ఆమోదం పొందింది.
తిరుగుబాటు జెండా ఎత్తారు!
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వంతో విప్లవ భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న ఖమ్మం బిడ్డలు ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయంపై తిరుగుబాటు జెండా ఎత్తారు. ‘జై తెలంగాణ’ అంటూ తొలికేక పెట్టారు. సీమాంధ్ర పాలకుల వివక్ష, ముల్కీ, నాన్ముల్కీ నిబంధనల అమలు అంశంపై 1969 జనవరి 8న తెలంగాణ ముద్దుబిడ్డ అన్నాబత్తుల రవీంద్రనాథ్ ప్రత్యేక నినాదంతో తెలంగాణ జెండాను భుజానికెత్తుకున్నారు. ఖమ్మం నడిబొడ్డున గాంధీచౌక్లో అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో ఆమరణ నిరరాహార దీక్షకు పూనుకున్నారు. ఖమ్మానికే చెందిన సింగరేణి ఉద్యోగి కొలిశెట్టి రాందాసు, కైలాస్నాథ్, నిమ్మల శంకర్రావు, కవిరాజమూర్తి, కోలాహాలం వెంకటేశ్వరరావు, వీ.రామస్వామి, అర్వపల్లి సుధాకర్, అర్వపల్లి విద్యాసాగర్ లాంటి సహచరులు వెన్నంటి ఉండగా.. అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఒక్కడే జనవరి 8 నుంచి 22 వరకు దీక్షను కొనసాగించారు. దాదాపు 14 రోజులపాటు అన్నపానీయాలు ముట్టకుండా ప్రాణాలను ఫణంగాపెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. ఆ పోరాటమే మహత్తర సంగ్రామానికి నాందిపలికింది. ఆయన దీక్షతో మేల్కొన్న తెలంగాణ సమాజం ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసింది. విద్యార్థులు, ఉద్యోగులు పిడికెళ్లిత్తి పోరాడుతుంటే, రాజకీయ పార్టీల నేతలూ జతకలిశారు.
మలి దశ ఉద్యమానికీ పురుడు పోసినం..
తెలంగాణ వ్యాప్తంగా 1969లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం.. తమ కుట్రల వల్ల నీరుగారిందని అప్పటి పాలుకులు, నాయకులు భావించారు. కానీ నివురుగప్పిన నిప్పులా, మబ్బుల మాటున దాగిన సూర్యుడిలా ఉండిపోయిందని గ్రహించలేదు. ఈ క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపిన తొవ్వలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్) ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను భుజానికెత్తుకున్నారు. అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఇచ్చిన స్ఫూర్తితో, 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ‘కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో..’ అనే నినాదంతో ముందుకు కదిలారు. దీంతో గడగడలాడిన సీమాంధ్ర పాలకులు కేసీఆర్ను అదే రోజు అరెస్టు చేసి ఖమ్మానికి తీసుకొచ్చారు. ఇక్కడైతే వలసవాదులు, సమైక్యవాదులు ఎక్కువగా ఉన్నారని, ఎలాంటి సమస్యా తలెత్తదని భావించారు. తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కవచ్చని కలలుగన్నారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. మలిదశ ఉద్యమకర్తను అరెస్టు చేసి ఖమ్మానికి తీసుకు వస్తున్నారన్న విషయం తెలియగానే.. ఇక్కడి తెలంగాణ శక్తులన్నీ ఏకమయ్యాయి. రాజకీయ పక్షాలు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల బాధ్యులు అంతా ఏకమై కేసీఆర్కు అండగా నిలబడ్డారు. పోలీసులతో కొట్లాడారు. దెబ్బలు తిన్నారు. జిల్లా ఉద్యమ బిడ్డల పోరాటాన్ని గమనించిన కేసీఆర్.. జిల్లా జైల్లోనూ, ఆ తర్వాత జిల్లా ప్రభుత్వాసుపత్రిలోనూ దీక్షను కొనసాగించారు. ఇదే పది జిల్లాల మలిదశ ఉద్యమానికి మరోమారు నాంది పలికింది.
తొలి బాంబు మనదే..
తెలంగాణ ముద్దుబిడ్డ అన్నాబత్తుల రవీంద్రనాథ్ దీక్షతో పది జిల్లాలు రగిలిపోయాయి. సీమాంధ్రుల దోపిడీపై దండుకట్టి తిరుగుబాటు జెండెత్తాయి. సబ్బండ వర్గాలన్నీ ఏకమై రోడ్లమీదకు వచ్చి ‘జై తెలంగాణ’ అంటూ గర్జించాయి. దీంతో సీమాంధ్ర పాలకుల గుండెల్లో దడ మొదలైంది. ఎలాగైనా ఉద్యమాన్ని నీరుగార్చాలనే దురుద్దేశంతో ఆనాటి హోంమంత్రి అయిన జలగం వెంగళరావును రంగంలోకి దింపారు. ఆయన ఖమ్మం జిల్లా కేంద్రానికి వచ్చి బంధుత్వం పేరుతో కొందరిని లోబర్చుకుని స్వరాష్ట్ర సాధన కమిటీలో చిచ్చుపెట్టారు. లేనిపోని భయాలను కల్పించి అన్నాబత్తుల దీక్షను బలవంతంగా విరమింపజేసేందుకు ప్రయత్నించారు. దీంతో రగిలిపోయిన విద్యార్థి సంఘం నాయకుడు మోహన్రావు నేతృత్వంలో పోరాట బిడ్డలు.. దీక్షాస్థలి గాంధీచౌక్ ప్రాంతానికి వచ్చిన కుట్రదారుడు వెంగళరావుపై బాంబులు విసిరారు. ఇదే స్ఫూర్తితో 1969 జనవరి 10 నుంచి 23 వరకు పాల్వంచ పట్టణంలో పోటు కృష్ణమూర్తి నిరాహారదీక్షను చేపట్టారు. ఇలా ఉద్యమం దావానంలా వ్యాపిస్తుండడంతో వసలవాదుల వెన్నులో వణుకుపుట్టి, అనేక అక్రమ నిర్బంధాలను ప్రయోగించారు. పోలీసులు లాఠీలతో కుళ్లబొడిచారు.
పులకించిన పురిటిగడ్డ..
రక్త తర్పణాలు, అక్రమ నిర్బంధాలు, ఎన్నో పోరాటాలు, మరెన్నో ఉద్యమాల ఫలితంగా అరవై ఏండ్ల అనంతరం నాలుగున్నరకోట్ల మంది ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందడుగు పడింది. దీంతో ‘జై తెలంగాణ’ అంటూ తొలికేక పెట్టిన ఉద్యమ గుమ్మం సంబురపడింది. మహత్తర సంగ్రామానికి నాంది పలికిన పురిటిగడ్డ పులకించి పోయింది. సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారుల కుట్రలను, బెదిరింపులను దాటుకుని దేశ రాజధాని సాక్షిగా 29వ రాష్ట్రంగా అవతరించింది. తల్లి తెలంగాణను తలుచుకుని ఆనంద భాష్పాలు రాల్చింది. ఈ క్రమంలో సబ్బండ వర్గాలు వ్యక్తం చేస్తున్న ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. అన్ని పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో నాయకులు, ఉద్యోగులు విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరినొకరు గుండెలకెత్తుకొని ‘జయహో తెలంగాణ’ అంటూ నినదిస్తున్నారు.
తొలి అమరులు మనవారే..
తెలంగాణ సాధన కోసం జిల్లా వాసులు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే సీమాంధ్ర పాలకులు నిర్బంధాన్ని తీవ్రతరం చేశారు. ప్రత్యేకవాదాన్ని అణచివేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చి పోలీసులను ఉసిగొల్పారు. ‘జై తెలంగాణ’ అంటూ నినదించిన వారందరినీ కుళ్లబొడిపించారు. దీనికి నిరసనగా పోరుబిడ్డలు జనవరి 17న ఆంధ్రా ఉద్యోగులుండే ప్రాంతంపై మరోమారు బాంబులు విసిరారు. ప్రతిగా సీమాంధ్ర కర్కష పోలీసులు తెలంగాణ వాదులపై తూటాల వర్షం కురింపించారు. ఈ కాల్పుల్లో జిల్లా ముద్దుబిడ్డలు కే.రాంచందర్, ఎండీ దస్తగీర్లు వీరమరణం పొందారు. మరో విద్యార్థి రాజారావు తీవ్రగాయాలపాలయ్యాడు. స్వరాష్ట్రం కోసం జరిగే పోరులో ఉద్యమబిడ్డలు కన్నుమూశారన్న సంగతి తెలిసిన యావత్ తెలంగాణ సమాజం కన్నెర్ర చేసింది. నాటి పాలకులు, పోలీసుల ఆగడాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో విద్యార్థులు ఉస్మానియా రైల్వేస్టేషన్కు నిప్పుపెట్టారు. ఇది సహించని ఖాకీమూకలు భాగ్యనగరం సాక్షిగా వందలమంది విద్యార్థులను సజీవదహనం చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన గార్ల ముద్దుబిడ్డ ప్రకాశ్జైన్ కూడా ఉన్నారు. వారి త్యాగం అజరామరమైనది. అమూల్యమైనది.