ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాచలం, ఆగస్టు 9:భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. జూలై చివరి వరకు 53 అడుగులు మూడో ప్రమాద, 48 అడుగులతో రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో కొనసాగిన వరద ఉధృతి ఆగస్టు 1 వరకు శాంతించింది. ఎగువన వర్షాలు కురుస్తుండడం, ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు విడుదల కావడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం రాత్రి 7 గంటల సమయానికి 44.60 అడుగులకు చేరుకున్నది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మంగళవారం రాత్రికి లేదా బుధవారం నాటికి 55 అడుగుల వరకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో ఒకేరోజు రికార్డు స్థాయిలో మూడు ప్రమాద హెచ్చరికలను జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ వెంటనే స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్, సారపాక,. అశ్వారావుపేట, పినపాక, ఏడూళ్లబయ్యారం తదితర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆదివారం రాత్రి పది గంటలకు 36 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం సోమవారం రాత్రి 7 గంటలకు 10 అడుగులు పెరిగి 44.60 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం 8 గంటలకు 38.70 అడుగులకు చేరుకున్న నీటిమట్టం గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. భద్రాచలం ప్రాంతంలో పెద్దగా వర్షం లేకపోయినా ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల వరద పెరుగుతోంది. గతంలో ఎన్నడూ రాని విధంగా ఈ ఏడాది జూలై నెలలోనే గోదావరి వరద రికార్డు స్థాయిలో 71.06 అడుగుల వద్ద ప్రవహించడంతో భద్రాచలం ఏజెన్సీలోని పలు ప్రాంతాలు నీట మునిగిన విషయం విదితమే. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు.